నైతికత ముఖ్యం
విద్యతో పాటు
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు
ఏఎన్యూ(పెదకాకాని): ప్రతి విద్యార్థి విద్యతో పాటు నైతిక విలువలు కలిగి ఉండాలని ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం – నైతిక విలువలు అనే అంశంపై ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.సురేష్కుమార్ అధ్యక్షత వహించారు. ఏఎన్యూ స్వర్ణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. విలువలతో కూడిన జీవితం ప్రతి విద్యార్థి విజయానికి మార్గమన్నారు. గురువు గౌరవాన్ని కాపాడలేని చదువు వ్యర్ధమన్నారు. విలువలతో కూడిన విద్య అభ్యసించిన వారు తప్పక విజయం సాధిస్తారన్నారు. కష్టపడిన వారు ఎప్పటికీ నష్టపోరని.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్, గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా, బెనారస్ యూనివర్సిటీ స్థాపనకర్త మదన్మోహన్ మాలవ్య, భూదాన ఉద్యమదాత ఆచార్య వినోభా బావే వంటి మహనీయులు సమాజంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని విజేతలుగా నిలిచారని గుర్తు చేశారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యాసంస్థ, గురువులు గర్వించేలా సమాజంలో ఉత్తమ గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ జి.సింహాచలం, రెక్టార్ ఆర్.శివరాంప్రసాద్లు ప్రసంగించారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు.
పెట్టుబడులతో స్వర్ణ బాపట్లగా అభివృద్ధి
బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్
బాపట్ల: పెట్టుబడులతో ‘స్వర్ణ బాపట్లగా’ జిల్లా రూపుదిద్దుకోనుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పర్యాటక, సేవా, వైద్య రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పెట్టుబడిదారులతో శనివారం ఆయన స్థానిక కలెక్టరేట్లో హైబ్రిడ్ మోడ్లో సమావేశం నిర్వహించారు. పర్యాటకంగా అభివద్ధి చెందుతున్న బాపట్లలో మీ పెట్టుబడులు పెట్టండి, చట్టబద్ధంగా అన్ని వనరులు మేము కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. మీ పరిశ్రమలు, యూనిట్ల స్థాపనకు డీపీఆర్ సిద్ధం చేసి ఇవ్వండి అవసరమైన అనుమతులు, భూమి కేటాయిస్తామన్నారు. బాపట్లలో రూ.4,555 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 20 మంది పెట్టుబడిదారులు ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు
బాపట్ల: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఏపీజిపిసిఇటిడాట్ ఏపీ సి ఎఫ్ ఎస్ ఎస్ డాట్ ఇన్ వెబ్ సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈనెల 19వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుందని, జిల్లాలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విజయవాడ కల్చరల్: కళా సాంస్కృతిక రంగాల పూర్వ వైభవానికి సంస్కార భారతి కృషి చేస్తుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. భరతముని జయంతి సందర్భంగా సుమధు కళానికేత్, సంస్కార భారతి మహానగర్ శాఖ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి నృత్య పోటీలను శనివారం అయోధ్యనగర్లోని కళావేదికపై ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సంస్కార భారతి పనిచేస్తుందని చెప్పారు. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అంశాల్లో యువతకు, చిన్నారులకు శిక్షణ తమ సంస్థ శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. నాట్యాచార్యులు సుధీర్రావు, పిళ్లా ఉమామహేశ్వరపాత్రుడు, రాష్ట్రీయ స్వయం సేవక్ ప్రతినిధి దుర్భా శ్రీనివాస్, సంస్కార భారతి సంస్థ బాధ్యలు బోడి ఆంజనేయరాజు పాల్గొన్నారు. జాతీయ స్థాయి నృత్య పోటీలను గాంధీనగర్లోని కౌతా పూర్ణానందం కళావేదిక, ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు కల్యాణ మండపం, కోదండ రామాలయం, అయోధ్యనగర్లోని హైందవి, శ్రీధర్మ పరిషత్ వేదికలపై సోలో విభాగంలో సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలను అందజేశారు.


