ఆర్ఓబీ, ఆర్యూబీలను పూర్తి చేయండి
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా రైల్వే, రెవెన్యూ అధికారులతో సమావేశం
నరసరావుపేట: జిల్లాలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద మంజూరైన ఆర్ఓబీ, ఆర్యూబీలను రైల్వే, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా ప్రతిపాదన దశలో ఉన్న 20 ఆర్ఓబీ, ఆర్యూబీలకు సంబంధించి సంయుక్త తనిఖీలను పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే డీపీఆర్లు పూర్తయిన 11 నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, ఆర్డీఓలు కె.మధులత, మురళీకృష్ణ, తహసీల్దార్ కె.వేణుగోపాల్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
పీఎం స్వానిధి క్రెడిట్ కార్డులు, రుణాల చెక్కులు పంపిణీ
నరసరావుపేట: ఏ విధంగా అయితే బ్యాంకులో స్వానిధి రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తారో అదేవిధంగా క్రెడిట్ కార్డు ద్వారా స్వీకరించిన సొమ్మును మరుసటి నెలలో చెల్లించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక టౌన్ హాలులో పీఎం స్వానిధి క్రెడిట్ కార్డులు, రూ.లక్ష రుణాల చెక్కులు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్తో కలిసి పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 995 మంది చిరు వ్యాపారులకు స్వానిధి క్రెడిట్ కార్డులు అందజేస్తున్నామన్నారు. 1000 మంది లబ్ధిదారులకు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు అందించిన రుణాల చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారతే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు పేద కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నాయని, ప్రతి మహిళ స్వయం సమృద్ధిగా ఎదగాలన్నదే ప్రభుత్వాల సంకల్పమన్నారు. మెప్మా పీడీ పాల్గొన్నారు.
ప్రతినెలా మొదటి వారంలో పాస్ పుస్తకాల పంపిణీ
జిల్లాలో ప్రతి నెలా మొదటి వారంలో పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ అతిథి గృహంలో రీ సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేపై కోర్టు కేసులు రాకుండా తగిన సూచనలు ఇప్పటికే అధికారులకు ఇవ్వటం జరిగిందన్నారు. ప్రతినెలా మరుసటి నెలకు పంపిణీ చేయాల్సిన పట్టాదారు పాస్పుస్తకాల కోసం పనిచేయాలన్నారు. పాస్ బుక్లకు కావాల్సిన లబ్ధిదారుల సమాచారంపై సంబంధిత అధికారులు, సిబ్బందికి ఒక అవగాహన ఉంటుందని, అందువలన ఆ సమాచారం హడావుడిగా కాకుండా ముందుగానే సేకరించి పెట్టుకోవాలన్నారు. పాస్బుక్ల రూపకల్పనలో తప్పులు లేకుండా వ్యవహరించాలన్నారు. సర్వేశాఖ జిల్లా అధికారి విష్ణుకీర్తి, ఆర్డీఓ కె.మధులత పాల్గొన్నారు.


