తల్లి, పిల్లలను కాపాడిన కానిస్టేబుల్
కుటుంబ కలహాల భారం మోయలేక తల్లి, పిల్లలతో ఆత్మహత్యాయత్నం రైలు కోసం ఎదురు చూపు గేట్మ్యాన్ సమాచారంతో పోలీసుల స్పందన ఆత్మహత్యాయత్నం నుంచి తల్లి, పిల్లలకు రక్షణ
నరసరావుపేట టౌన్: కుటుంబ సమస్యలతో ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించింది. రైల్వే గేట్మ్యాన్ ఇచ్చిన సమాచారంతో విధుల్లో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అప్రమత్తమై వారిని రక్షించిన సంఘటన శుక్రవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ ఓబయ్య కాలనీకి చెందిన మేతే అలివేలు తన తొమ్మిది సంవత్సరాల కుమారుడు కల్యాణ్, ఏడేళ్ల కుమార్తె నిరీక్షణ, మూడు నెలల పాపను తీసుకొని శుక్రవారం నరసరావుపేట రైల్వేస్టేషన్ సమీపంలోని మొదటి రైల్వే గేటు వద్దకు వచ్చింది. రైల్వే గేట్మ్యాన్తో రైలు వచ్చే సమయం గురించి ఆరా తీసింది. దీంతో అనుమానం వచ్చిన గేట్ మ్యాన్ అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తయూబ్కు సమాచారం అందించాడు. ఆమె వైఖరిపై అనుమానం రావటంతో విషయాన్ని సీఐ లోకనాథం దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో సీఐ అక్కడికి చేరుకొని అలివేలుతో పాటు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకొని వన్టౌన్ స్టేషన్కు తరలించారు. వివరాలు అడగ్గా అత్త, బావ, మరిదిలు తనను వేధిస్తూ భర్తను దూరం చేశారని ఆ మానసిక వేదన భరించలేక ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చానని పోలీసులకు వివరించింది. దీంతో ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
తల్లి, పిల్లలను కాపాడిన కానిస్టేబుల్


