ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్కు 22 అర్జీలు
ఎస్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించండి
సర్వే నంబరు 445లో ఎస్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. గతంలో కలెక్టర్లు ఎల్.శివశంకర్, పి.అరుణ్బాబులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అర్జీలు అందజేశాం. తహసీల్దార్ వేణుగోపాలరావును ఆదేశించారు. గ్రామంలో చుట్టూ వెంచరు మధ్యలో ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఇష్టం లేక స్థలాలు కేటాయించట్లేదు. నవంబర్ 15లోపు గ్రామంలో ఉన్న ఎస్సీలకు స్థలాలు కేటాయించకపోతే రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తాం.
– చింతిరాల మీరయ్య మాదిగ,
ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు
దళితులకు రెడ్బుక్ పాలన నుంచి
విముక్తి కలిగించండి
నరసరావుపేట: రాష్ట్రంలో దళితులను రెడ్బుక్ పాలన నుంచి విముక్తి కలిగించి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుచేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్కు పలువురు నాయకులతో కలిసి ఆయన హాజరయ్యారు. దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై కలెక్టర్కు అర్జీ అందజేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపు ధోరణి అధికమైందని తెలిపారు. గత ప్రభుత్వంలో మంజూరైన చర్మకారులు, డప్పు కళాకారుల పెన్షన్లను తొలగిస్తోందని ఆరోపించారు. దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని విడనాడాలని కోరారు. రొంపిచర్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుండాల వెంకటే ష్, వినుకొండ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రెడ్డిబోయిన ప్రవీణ్, శావల్యాపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ధార మోషే, మండల ఉపాధ్యక్షులు కాల్పుకూరి వినోద్, కారంపూడి మండల ఎస్సీ సెల్ కార్యదర్శి పేతురు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక పీజీఆర్ఎస్కు 22 అర్జీలు


