
ఎన్ఎంఎంఎస్ నమోదు గడువు 15 వరకు పొడిగింపు
నరసరావుపేట ఈస్ట్: దేశవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ మంగళవారం తెలిపారు. అలాగే పరీక్ష రుసుము చెల్లించేందుకు ఈనెల 16వ తేదీ వరకు గడువు పొడించినట్టు పేర్కొన్నారు. ఈమేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్సైట్ www. bse. ap. gov. in లో అందుబాటులో ఉందని స్పష్టం చేసారు. ఆన్లైన్ అనంతరం సంబంధిత ప్రింటెడ్ నామినల్ రోల్స్ను ఈనెల 18వ తేదీ లోగా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ప్రాథమికోన్నత, ఎయిడెడ్, వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను తప్పనిసరిగా ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. అలాగే దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. దరఖాస్తు నమోదులో ఆధార్ కార్డులో ఉన్న విధంగా విద్యార్థి పేరు నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసేందుకు ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదనీ, పరీక్ష రాసే సమయంలో అన్ని ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలని తెలిపారు. వివరాలకు ప్రభుత్వ వెబ్సైట్, డీఈఓ కార్యాలయంలోని డీఎన్ఓ పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు.
జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ