
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
పోస్టర్ ఆవిష్కరించిన మెంబర్ సెక్రటరీ,
రోడ్డు సేఫ్టీ ప్రతినిధులు
నరసరావుపేట: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేస్తామని రోడ్డు సేఫ్టీ మెంబర్ సెక్రటరీ, ఆర్అండ్బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.గీతారాణి పేర్కొన్నారు. పల్నాడు జిల్లా రహదారి భద్రతా కమిటీ రూపొందించిన ‘థింక్ రోడ్డు సేఫ్టీ’ పోస్టర్ను బుధవారం ఆర్అండ్బీ కార్యాయంలో రోడ్డు సేఫ్టీ అధ్యక్షురాలు దుర్గాపద్మజ, సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమెను రోడ్డుసేఫ్టీ ఎన్జీఓ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈసందర్భంగా గీతారాణి మాట్లాడుతూ సుప్రీంకోర్టు కమిటీ ఆన్రోడ్ సేఫ్టీపై ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామన్నారు. రోడ్డు సేఫ్టీ ఎన్జీఓ తరఫున ఇచ్చే సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని కమిటీలో చర్చించటం జరుగుతుందన్నారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు సూచనల మేరకు జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు కృషిచేస్తామని అన్నారు. ఎన్జీఓ సభ్యులు బంగారయ్య పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం
నరసరావుపేటరూరల్: అల్లూరివారిపాలెం రోడ్డులోని లింగంగుంట్ల చెక్పోస్ట్ సమీపంలోని మానసాదేవి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు దంపతులు, నేరేళ్ల విజయలక్ష్మి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.
ఉద్యోగం నుంచి వార్డెన్ తొలగింపు
కారెంపూడి: స్థానిక మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ఇన్ఛార్జి వార్డెన్ శౌరీ భాయిని ఉద్యోగ విధుల నుంచి తప్పించినట్లు డీఈఓ ఎల్.చంద్రకళ ఆదేశాలు జారీ చేశారని ఎంఈఓ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వార్డెన్పై వచ్చిన అభియోగాలు నిజమని కమిటీ విచారణలో తేలడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎంతో బాధ్యతగా ఉండాలని ఎలాంటి నిర్లక్ష్యాన్ని, అభ్యంతకర ప్రవర్తనను ఉపేక్షించేది లేదని ఎంఈఓ రవికుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
558.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయంం నీటిమట్టం బుధవారం 558.70 అడుగులకు చేరింది. ఇది 229.3671 టీఎంసీలకు సమానం.సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,650 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 65,900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
3 వేల కిలోల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం
పొన్నూరు: పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న దుకాణంలో బుధవారం మున్సిపల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాదాపు మూడు వేల కిలోల ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం 21 వార్డులోని ఓ ట్రేడర్స్లో విక్రయానికి ఉంచిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యజమానికి రూ. 10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం