
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రతిపాదనలు
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ఓప్రకటనలో తెలిపారు. జిల్లాలో అర్హులైన ఉపాధ్యాయులు మండల విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారుల ద్వారా ఈనెల 13వ తేదీలోపు https://nationalawardstoteachers. education.gov.in సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కోటప్పకొండ తొలిఏకాదశి ఆదాయం రూ.24.02లక్షలు
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి రూ.24.02 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు తెలిపారు. స్వామి వారి హుండీల లెక్కింపు సోమవారం నిర్వహించి ఆదాయ వివరాలు వెల్లడించారు. టిక్కెట్ల ద్వారా రూ.9,09,090లు, ప్రసాదాల ద్వారా రూ.4,39.380లు, హుండీల ద్వారా రూ. 9,68,028లు, అన్నదానానికి రూ.86,051లు ఆదాయం లభించినట్టు వివరించారు.
మెగా పేరెంట్స్ మీట్కు
పటిష్ట ఏర్పాట్లు
నరసరావుపేట: జిల్లాలో ఈనెల 10న నిర్వహించనున్న ‘మెగా పేరెంట్స్ మీట్’కు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1580 ప్రభుత్వ, 458 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 2,308 పాఠశాలలు, 91 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హాజరయ్యేవారికి భోజన సదుపాయాలతో ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తగా వండించాలన్నారు.
లైంగిక దాడి కేసులో
ముద్దాయికి జీవిత ఖైదు
గుంటూరు లీగల్: లైంగిక దాడి కేసులో ముద్దాయికి జీవిత ఖైదు విధిస్తూ గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి షమీ పర్విన్ సుల్తానా బేగం సోమవారం తీర్పు వెలువరించారు. 2014లో పొన్నూరు పోలీసు స్టేషన్లో నమోదైన లైంగిక దాడి కేసులో 32 సంవత్సరాల మద్దసాని సురేంద్ర 13 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సమర్పించారు. కేసులో నేరం రుజువు కావడంపై ముద్దాయికి జీవిత ఖైదు, రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. బాధితురాలికి నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షలు చెల్లించేలా తీర్పు చెప్పారు. ముద్దాయిని జిల్లా జైలుకు తరలించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బరత్ అలీఖాన్ వాదనలు వినిపించారు. బాధిత బాలికకు న్యాయం జరిగిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ప్రతిపాదనలు