
60 గజాల స్థలంలో నిర్మాణాలకు సడలింపులు
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్, పట్టణాభివృద్ది రంగాన్ని పారదర్శకంగా, వేగవంతంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో జీఓ నెం.114 ద్వారా ఏపీ బిల్డింగ్ రూల్స్–2017 కీలకమైన సవరణలు తీసుకొచ్చిందని ఏపీ కానఫెడరేషన్ ఆప్ లైసెన్స్డ్ ఇంజనీర్లు, సర్వేయర్లు, ఆర్కిటెక్చర్లు (క్లెసా,ఏపీ) అధ్యక్షులు కొమ్మసాని కమలాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాక్షికి వివరాలు తెలియచేశారు. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన భవన నియమావళిలో చేసిన సవరణల ప్రకారం 50 చదరపు మీటర్లు (60) గజాల లోపు స్థలాల్లో భవన నిర్మాణానికి సడలింపు ఇచ్చిందన్నారు. ఆ స్థలాల్లో గ్రౌండ్, గ్రౌండ్ ప్లస్ వన్ ఫ్లోర్ భవన నిర్మాణానికి పూర్తి ఫీజుల మినహాయింపు ఇస్తూ కేవలం రూ.1టోకెన్ ఫీజుతో ఆన్లైన్న్లో దరఖాస్తు చేసుకోనే అవకాసం ఇచ్చిందన్నారు. కంప్లీషన్, ఆకుపెన్సీ సర్టిఫికేట్ అవసరం లేకుండా చేసిందన్నారు. మూడు మీటర్ల లోపు సెట్బాక్ ఉన్న ప్రదేశాల్లో టీడీఆర్ వినియోగాన్ని అనుమతించిందన్నారు. పాత పట్టణాలకు ఇది అనుకూలంగా ఉంటుందన్నారు. అపార్ట్మెంట్లు, మాల్స్, హోటల్స్, ప్రభుత్వ భవనాల్లో సీసీటీవీ, ఎల్ఓటీ, డీటీహెచ్, కేబుల్ టీవీ వంటి వసతులు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని, వాటిలో 90 రోజుల ఫుటేజ్ స్టోరేజ్ తప్పనిసరిగా ఉండాలని సూచించిందన్నారు. 300 నుంచి 500 చదరపు మీటర్ల స్థలాల్లో సెల్లార్కు అనుమతించిందని, నిర్మాణ సమయంలో పక్క భవనాలకు హానీ కలగకుండా స్ట్రక్చరల్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందన్నారు. భూమిని విరాళంగా ఇచ్చినవారికి ఆర్డీబీ ప్రకారం టీడీఆర్ ద్వారా ప్రోత్సాహం ఇచ్చిందని, అయితే తొమ్మిది మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్లకు టీడీఆర్ వర్తించదని పేర్కొన్నారు. యుఎల్బీ, యూడీఎ లెవెల్లో గడువు మూడేళ్ల వరకు మాత్రమే ఉండేలా సవరణలు చేస్తూ పదిశాతం బిల్డ్అప్ ఏరియాను రిజిష్టర్డ్ మార్టగేజ్ డీడ్ ద్వారా మున్సిపాలిటీకి హాండోవర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. నిర్మాణ భద్రత కోసం ఇండెమ్నిటీ బాండ్, స్ట్రక్చరల్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసిందన్నారు. గత కొన్నిరోజులుగా క్లెసా తరపున సమర్పించిన సూత్రాలు, ప్రజాభిప్రాయాలను పరిగణలతో ఈ మార్పుల రూపకల్పనకు ప్రభు త్వం శ్రీకారం చుట్టిందని తాము భావిస్తున్నామన్నారు. ఈ జీవో అమలుతో భవన అనుమతుల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని, చిన్న గృహ నిర్మాణాలకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యం కలుగుతుందని అన్నారు.
జీఓ 114 ద్వారా స్పష్టంచేసిన ప్రభుత్వం
క్లెసా ఏపీ అధ్యక్షులు
కె.కమలాకరరెడ్డి వెల్లడి