
నేడు పానకాల స్వామి ఆలయంలో దీపాలంకరణ
మగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం(పానకాల స్వామి)లో శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉత్సవం నిర్వహించనున్నట్లు ఈవో సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.
కాలువలోకి దూసుకెళ్లిన టూరిస్టు బస్సు
పెదకాకాని: ప్రయాణికులతో వస్తున్న బస్సు కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం త్రుటిలో తప్పింది. తణుకు నుంచి అరుణాచలం తీర్ధయాత్రకు 39 మంది ప్రయాణికులతో టూరిస్టు బస్సు బయలుదేరింది. వారు శుక్రవారం రాత్రి పెదకాకాని శివాలయంలో నిద్ర చేసి ఉదయం బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. డ్రైవర్ సర్వీసు రోడ్డులో బస్సును నడుపుతున్నాడు. పెదకాకాని మండలం నంబూరు అరబిక్ స్కూల్ సమీపంలోకి చేరుకునే సరికి బస్సు నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు వంతెనపైకి ఎక్కి ఆగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా భయంతో కేకలు వేశారు. పలువురి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.
నేడు ఎస్సీ,ఎస్టీల ప్రత్యేక
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆయన కోరారు.
జిల్లా వ్యవసాయాధికారిగా జగ్గారావు
నరసరావుపేట: జిల్లా వ్యవసాయాధికారిగా ఎం.జగ్గారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాధా రణ బదిలీల్లో భాగంగా కమిషనర్ కార్యాలయం నుంచి పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఆయన నియమితులయ్యారు. గత మూడేళ్లుగా విధుల్లో ఉన్న ఐ.మురళిని కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రపంచ స్థాయి పవర్
లిఫ్టింగ్ పోటీలకు వంశీకృష్ణ
జాతీయ పోటీలలో రెండు బంగారు
పతకాలు కై వసం
సత్తెనపల్లి: ఈ ఏడాది ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన క్రీడాకారుడు పసుపులేటి వంశీకృష్ణ ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. కర్ణాటక రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్ర జట్టులో ఉన్న పసుపులేటి వంశీకృష్ణ రెండు బంగారు పతకాలు సాధించి, పల్నాడు జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశాడు. వంశీకృష్ణ డెడ్లిఫ్ట్లో 83 కేజీల విభాగంలో 285 కేజీలు ఎత్తి బంగారు పతకం సాధించాడు. మొత్తం 737.5 కిలోలు బరువు ఎత్తి ఓవరాల్గా మరో బంగారు పతకం కై వసం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై న వంశీకృష్ణను శుక్రవారం పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ పల్నాడు జిల్లా సెక్రటరీ, కోచ్ పసుపులేటి సురేష్, ప్రెసిడెంట్ జిమ్ రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివరావు, కత్తి పవన్, మాతంగి రాహుల్ గౌతమ్, జి.రమేష్, శాంతయ్య, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారులు అభి నందించారు.

నేడు పానకాల స్వామి ఆలయంలో దీపాలంకరణ