
యల్లమందలో రైతు భరోసా కేంద్రం
విప్లవాత్మక మార్పులకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు
పంట ఉత్పత్తుల విక్రయాలు ఆర్బీకేల ద్వారానే
ఏడాదిగా ఆర్బీకేలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్పు
ఎరువులు, విత్తనాలు అందని పరిస్ధితి
మూలనపడ్డ కియోస్క్ మిషన్లు
నరసరావుపేట రూరల్: రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లోనే వ్యవసాయ సేవలు అందించేందుకు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతోపాటు పంట ఉత్పత్తుల కొనుగోలు రైతులకు చేదోడుగా ఉండేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు సలహాలు, సూచనలు అందించడంతోపాటు ప్రభుత్వం నుంచి అందే పథకాలను సకాలంలో అన్నదాతల దరిచేర్చే విధంగా గ్రామ వ్యవసాయ సహాయకుడిని నియమించారు. ఈ విధంగా జిల్లాలో 432 ఆర్బీకేలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి గ్రామంలో ఆర్బీకే నిర్మాణం
రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించింది. దాదాపు రూ.50లక్షల వ్యయంతో ఆర్బీకేలకు సొంత భవనాలు నిర్మించడంతోపాటు కుర్చీలు, కంప్యూటర్, టేబుళ్లు, పుస్తకాల ర్యాక్లు సమకూర్చారు. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనలు అందుకొని విజ్ఞానాన్ని పొందేందుకు స్మార్ట్ టీవీలను ఏర్పాటుచేశారు. అంతేకాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్ మిషన్లు కూడా నెలకొల్పారు.
కూటమిలో నామమాత్రంగా సేవలు
ఏడాది కిందట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. ఐదు సంవత్సరాలుగా రైతులకు సేవలందించిన కేంద్రాలు నేడు అలంకారప్రాయంగా మారాయి. విత్తనాలు, ఎరువుల పంపిణీని నామమాత్రం చేశారు. దీంతో సకాలంలో విత్తనాలు, ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ ప్రణాళిక పక్కాగా అమలు జరిగింది.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఏ సమయంలో ఏ ఎరువులు అవసరం అనే దానిపై ప్రభుత్వం పక్కాగా వ్యవహరించి అన్ని సిద్ధంగా ఉంచేది. ఈ ఏడాది కాలంగా ప్రణాళిక లేకపోవడంతో విత్తనాలు దొరక్క అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులు సైతం బ్లాక్ చేసి వ్యాపారులకే ప్రభుత్వం అండగా నిలిచింది. ధాన్యం సైతం ఆర్బీకేల నుంచి ఈ ఏడాది కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర రైతులకు అందలేదు.