ముగిసిన చెన్నమల్లేశ్వరుని కల్యాణ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెన్నమల్లేశ్వరుని కల్యాణ వేడుకలు

Jun 12 2025 3:11 AM | Updated on Jun 12 2025 1:18 PM

Purnahuti Homam

చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో పూర్ణాహుతి హోమం

రేపల్లె: ఇసుకపల్లిలోని భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న త్రైమాసిక కల్యాణ వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూర్ణాహుతి హోమం నిర్వహించారు. అనంతరం వసంతోత్సవం, ధాన్యకుట్టునోత్సవం, త్రిశూల స్నానాలు, పవళింపు సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

81 కలశాలతో వేంకటేశ్వర స్వామికి అభిషేకం

తాడేపల్లి రూరల్‌ : సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి బుధవారం 81 కలశాలతో అభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళశాసనాలతో జ్యేష్ట నక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు స్వామి వారికి 81 కలశాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం హయగీవ్ర హోమం, అష్టోత్తర శతనామార్చన, పూర్ణాహుతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

జీజీహెచ్‌లో నీటి సరఫరాకు అంతరాయం

– తక్షణమే పునరుద్ధరణ

గుంటూరు మెడికల్‌: గుంటూరు మున్సిపాలిటీకి చెందిన ప్రధాన ‘ఎ’ లైన్‌లో నీటి వాల్వ్‌ మరమ్మతులకు గురైంది. ఈ పైపులైన్‌ ద్వారా గుంటూరు జీజీహెచ్‌లోని ఏడు భవనాలను నీరు సరఫరా అవుతోంది. ఈ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఆరు భవనాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండగా, ఒక భవనానికి మాత్రమే తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోయిందని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమణ యశశ్వి బుధవారం తెలిపారు. విషయం మున్సిపాలిటీ అధికారులకు తెలియజేయగా 90 నిమిషాల్లోనే వాటర్‌ ట్యాంకర్‌ను పంపించి ఆ భవనానికి నీటిని అందించారన్నారు. నీటి సమస్య కేవలం మంగళవారం ఒక్కరోజే మాత్రమే తలెత్తిందని తెలిపారు. గత నాలుగు రోజులుగా ఎటువంటి అంతరాయం లేదన్నారు.

కొండవీడు కోటలో

యోగా కార్యక్రమం రద్దు

యడ్లపాడు: కొండవీడు కోటలో బుధవారం ఉదయం జరగాల్సిన ప్రత్యేక యోగా కార్యక్రమం అకాల వర్షం కారణంగా రద్దయింది. జిల్లా కలెక్టర్‌ పి. అరుణ్‌బాబు ఆధ్వర్యంలో టూరిజం, అటవీ శాఖల పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఘాట్‌రోడ్డులోని చెక్‌పోస్టు వద్ద ఉదయం 6 గంటల నుంచి గంటన్నరపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా చివరి క్షణంలో రద్దు చేశారు. ఈ నెల 18న అమరావతిలోని జ్ఞాన బుద్ధ ప్రాంతంలో చివరి యోగా కార్యక్రమం జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement