
కళానిలయం పీఆర్ మోహన్ మృతి
నాలుగు దశాబ్దాలుగా కళారంగానికి విశేష సేవలు
చిలకలూరిపేట: కళారంగంలో చిలకలూరిపేట కీర్తిని దేశనలుమూలలా వ్యాపింపచేసిన కళానిలయం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రగడ రాజమోహనరావు (84) అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. పీఆర్ మోహన్గా గుర్తింపు పొందిన ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 1941లో జన్మించిన ఆయన చిరువ్యాపారాలు చేసుకుంటునే కళారంగ ప్రముఖులు ఎస్ఎం బాషా ప్రోత్సాహంతో నాటక రంగ ప్రవేశం చేసి చైర్మన్, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శిక్షార్హులు, రాణి సంయుక్త, జై జవాన్ వంటి నాటికల్లో నటించటంతో పాటు 25కి పైగా పురస్కారాలు అందుకున్నారు. 1984లో కళానిలయం సంస్థను ప్రారంభించి గత నాలుగు దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్య, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే నెల 24 నుంచి 26వరకు శ్రీవెంకటేశ్వరస్వామి ఆర్యవైశ్య కళ్యాణమండపంలో 40వ జాతీయ స్థాయి సంగీత, నాట్య కళారూపాల పోటీలు నిర్వహించారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నా ముఖ్యంగా గత రెండేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో సైతం మంచానికే పరిమితమై కూడా పోటీలు నిర్వహింపచేసిన కళాతపస్వి రాజమోహనరావు. ప్రతి ఏటా నిర్వహించే కళానిలయం పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది వరకు కళాకారులు పాల్గొంటూ ఉంటారు.
కళారంగ ప్రముఖులకు సన్మానాలు
ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సినీ దర్శకులు, కళాతపస్వి కె.విశ్వనాఽథ్, నటులు మిక్కిలినేని రాధాకష్ణమూర్తి, నాటితరం నటీమణులు అంజలీదేవి, షావుకారు జానకి, బుర్రకథ పితామహుడు పద్మశ్రీ నాజర్, నాట్యాచార్యులు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ, సినీనృత్య దర్శకుడు పీవీ శేషు, ఆంధ్రాజాలరి బిరుదాంకితుడు ఆనం లక్ష్మణరావు, ప్రముఖ కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి, సినీనటి రోజారమణి, ప్రఖ్యాత నర్తకి స్వాతి సోమనాథ్ గేయరచయిత్రి శశిబాల చేబ్రోలు వంటి ఎందరో ప్రముఖులు ఈ వేదికపై ఘన సత్కారాలు అందుకున్నారు. మృతి చెందిన రాజమోహనరావుకు భార్య శివ సత్యనారాయణమ్మ, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే సుబ్బయ్యతోటలోని ఆయన నివాసానికి పలువురు కళారంగ ప్రముఖులు వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.