
750 మంది ఎస్జీటీలకు స్థాన చలనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న 750 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్జీటీ) వేర్వేరు పాఠశాలలకు బదిలీ అయ్యారు. ఉపాధ్యాయుల ఆందోళన ఫలితంగా వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేసి మాన్యువల్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో బదిలీల ప్రక్రియ చేపట్టింది. సీనియార్టీ జాబితాలోని వరుస క్రమంలో ఒకటి నుంచి 750 వరకూ పేర్లు ఉన్న ఎస్జీటీ (తెలుగు)లను పిలిచిన విద్యాశాఖాధికారులు, పాఠశాలల్లోని ఖాళీలను డిస్ప్లే చేసి, ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మొదటి రోజు లాంగ్ స్టాండింగ్ విభాగంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీలో శారీరక వైకల్యం గల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లదలచుకున్న పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. గుంటూరు, పల్నాడు జిల్లాల డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళతో పాటు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి పరిశీలకురాలిగా వచ్చిన జేడీ (సర్వీసెస్) పి. శైలజ కౌన్సెలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా కౌన్సెలింగ్ ప్రక్రియను పరిశీలించారు. డీఈవో కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లు రమణ, శైలజ, ఏపీ ఎస్డీఎంఏ డీపీఎం ఎ. లక్ష్మీకుమారి, డ్వామా పీడీ వి. శంకర్, ఎంఈవోలు, విద్యాశాఖ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాన్యువల్ విధానంలో
కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు
నేడు 750 నుంచి 1,750
వరకు నిర్వహణ

750 మంది ఎస్జీటీలకు స్థాన చలనం