
అంసపూర్తిగా భవనాలు..
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ పాఠశాలల్లో నాడు– నేడు పనులను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాల్సి ఉంది. కానీ కూటమి పాలకుల నిర్లక్ష్యంతో ఆయా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. పల్నాడు జిల్లా పరిధిలో రూ.165 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.90 కోట్ల పనులు చేశారు. తొలి దశలో రూ.53.50 కోట్లు, రెండో విడతలో రూ.27.47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ‘నాడు– నేడు’ భాగంలో మొదటి దశలో 746 పాఠశాలల్లో పనులు చేపట్టాల్సి ఉంది. 88 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తయ్యాయి. 266 బడుల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో 194 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం శ్లాబ్ దశకు, 66 స్కూల్స్లో రూఫ్ లెవల్కు, 34 పాఠశాలల్లో కిటికీలు, 27 పాఠశాలలు బేస్మెంట్ దశలో ఉన్నాయి. మరో 71 పాఠశాలల్లో అసలు పనులు ప్రారంభించలేదు. రెండో దశలో 629 పాఠశాలలకు గాను కేవలం 33 పాఠశాలల్లోనే పనులు పూర్తి చేశారు. చివరి దశలో 153, శ్లాబ్ దశకు 99, కిటికీల దశకు 36, బేస్మెంట్ దశకు 40 పాఠశాలల్లో పనులు పూర్తి చేశారు. మరో 223 పాఠశాలల్లో అసలు పనులే ప్రారంభించని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులకు చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తుందని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.