
ప్రజాసంక్షేమం పక్కన పెట్టి వేధింపులకే కూటమి ప్రాధాన్యం
కూటమి ప్రభుత్వ పాలనలో జాడలేని అభివృద్ధి
ఏడాదిగా చెప్పుకోదగ్గ ఒక్క పనీ పూర్తి కాని వైనం
ఆరు నెలల్లో ‘వరికపూడిశెల’ పూర్తికి హామీ
ఏడాదైనా తట్టెడు మట్టి కూడా ఎత్తని పాలకులు
అగమ్యగోచరంగా పిడుగురాళ్ల వైద్య కళాశాల భవితవ్యం
నరసరావుపేట ఆటోనగర్, క్రిటికల్ కేర్, వినుకొండ ట్రామాకేర్లదీ అదే దుస్థితి
చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తున్న ప్రజలు
సూపర్ 6 అమలు చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది. భారీ ఎత్తున సంబరాలకు పాలకులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ఏడాది కూటమి పాలనలో ఏం సాధించారని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధే జరగలేదని ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారు. తామొస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. కానీ గద్దెనెక్కాక ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలను హతమార్చడం, దాడులు చేయడం, అరెస్టు చేయడం మినహా చేసిందేమీ లేదు. సూపర్ సిక్స్ పథకాల ఊసు కూడా లేదని జిల్లా ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మోసాల పాపపు పాలనపై మండిపడుతున్నారు.
సాక్షి, నరసరావుపేట: వెఎస్సార్సీపీ ప్రభుత్వానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఊరూవాడా ఊదరగొట్టారు. ప్రకటించిన మేరకు సూపర్–6 పథకాలైనా అమలయ్యాయా.. అంటే అదీ లేదు. ఏడాదిగా వాటి ఊసు లేదు. కనీసం ఎప్పుడిస్తారో పాలకులకే స్పష్టత లేదు. గత ప్రభుత్వం ప్రారంభించిన పిడుగురాళ్ల మెడికల్ కళాశాల, వరికపూడిశెల పనులు కూడా పూర్తి చేయలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం సాధించారని విజయోత్సవ ర్యాలీలు చేపడుతున్నారంటూ పల్నాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సంవత్సరమైనా పట్టింపు శూన్యం
ఏడు దశాబ్దాలుగా పల్నాటి ప్రజల కల వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం. గతంలో ఎంతో మంది నేతలు అనుకున్నా ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ వంటి కీలక అనుమతులను కేంద్రం నుంచి తేవడంలో సఫలీకృతం కాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి కీలక ముందడుగు వేశారు. మొదటి దశ పనులను ప్రారంభించారు. అంతలో ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చంద్రబాబు మొదలు స్థానిక నేతల వరకు హామీ ఇచ్చారు. ఏడాదైనా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ప్రజలు వాపోతున్నారు.
జిల్లా ప్రజలకు తీరని అన్యాయం
మరోవైపు జలజీవన్ మిషన్, వైఎస్సార్ కరువు నివారణ పథకం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదైనా జేజేఎం పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందించలేదు. నరసరావుపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు ఇంకా స్థల సేకరణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు ప్రారంభం కాలేదు. వినుకొండ ట్రామాకేర్ ఏర్పాటు ఎంతో అత్యవసరం. కానీ దాని ఊసే ప్రస్తుత పాలకులు ఎత్తడం లేదు. సాగర్ కాలువలకు మరమ్మతులు చేయలేదు. కీలక జాతీయ రహదారుల పనులు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా నకరికల్లు – వాడరేవు జాతీయ రహదారి భూసేకరణ నేటికీ పూర్తి కాలేదు. మాదిపాడు బ్రిడ్జ్ పూర్తి చేయలేదు.
వైద్యసేవలు దూరం
మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాకే తలమానికమైన పిడుగురాళ్ల మెడికల్ కళాశాల భవితవ్యం కూటమి ప్రభుత్వం వచ్చాక అయోమయంలో పడింది. సుమారు 50 ఎకరాల్లో రూ.500 కోట్లతో కడుతున్న కళాశాల పనులలో కీలక విభాగాలు గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పూర్తికావొచ్చాయి. మిగిలిన అరకొర పనులు పూర్తికి ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడింది. ఎప్పటి నుంచి ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయి, మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభమెప్పుడు? వంటి వాటికి సమాధానాలు లేవు. ఈ నేపథ్యంలో ఏడాది పాలనలో సాధించిన అభివృద్ధి ఏంటని కూటమి నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సంక్షేమానికి తూట్లు...
ఎన్నికల ముంగిట అధికారంలోకి వస్తే సూపర్–6 పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి పార్టీలు ఊరూ వాడ తిరిగి ప్రచారం చేశాయి. పీఠం ఎక్కి ఏడాదైనా అమలుకు నోచుకోలేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
రెడ్ బుక్ అమలుకే ప్రాధాన్యం..
కూటమి పార్టీలకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరుల ఇళ్లపై కూటమి గూండాలు దాడులు మొదలుపెట్టారు. వందలాది కుటుంబాలు పల్నాడు జిల్లా వదలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లి తలదాచుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పోలీసులను అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు వినియోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజిని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు సహా సుమారు 390 మంది కార్యకర్తలు, పాతిక మంది సోషల్మీడియా యాక్టివిస్టులు, తొమ్మిది మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగారు. వందలాది మందిని జైళ్లపాలు చేసి కక్ష రాజకీయాలు చేస్తున్నారు. పొలిటికల్ బాస్లకు పోలీసులు సెల్యూట్ కొడుతున్నారని అపవాదుంది. మరోవైపు కూటమి నేతలు ఏడాదిగా ఇసుక, మట్టి, గ్రానైట్, రేషన్ బియ్యం అక్రమ రవాణాతో రూ.కోట్లు తమ జేబుల్లో వేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకుంటున్నారు.