సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతల దాడిపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతల దాడిపై ఫిర్యాదు

Jun 11 2025 8:54 AM | Updated on Jun 11 2025 8:54 AM

సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతల దాడిపై ఫిర్యాదు

సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతల దాడిపై ఫిర్యాదు

తాడేపల్లి రూరల్‌: మంగళగిరి ఆత్మకూరులోని సాక్షి యూనిట్‌ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దాడి చేసిన సంఘటనపై మంగళగిరి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పత్రిక ప్రతినిధులు, పాత్రికేయులు మంగళవారం ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్‌ ఎస్‌ఐ చిరుమామిళ్ల వెంకట్‌ను సాక్షి మంగళగిరి ఆత్మకూరు బ్రాంచ్‌ మేనేజర్‌ గోపి, బ్యూరోలు రమేష్‌, అశోక్‌, ఇతర మీడియా మిత్రులతో కలసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి కార్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి కేసు నమోదు చేయాలని ఎస్‌ఐ వెంకట్‌ను వారు కోరారు.

వైకుంఠపురవాసుడి సేవలో హైకోర్టు జడ్జి కుటుంబ సభ్యులు

తెనాలి: చిన్న తిరుపతిగా పేరొందిన స్థానిక వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జి.రఘురాం సతీమణి జి.భార్గవి, కుటుంబ సభ్యులు సందర్శించారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు. వారికి దేవస్థాన పండితులు, అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ ఘనస్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైభవంగా వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవం

నాదెండ్ల: సాతులూరులోని రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పూజారి చిలకపాటి భరద్వాజ కల్యాణమూర్తులను అలంకరించి పీటలపై కూర్చుండబెట్టి కల్యాణధారణ గావించారు. గ్రామానికి చెందిన పలువురు పీటలపై కూర్చుని కల్యాణాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్‌, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

రవాణా శాఖలో బదిలీలు

పట్నంబజారు (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో బదిలీలు జరిగాయి. గుంటూరులో మోటార్‌ వాహనం తనిఖీ అధికారులు గోపాల్‌ను చిలకలూరిపేటకు, సంధ్య నెల్లూరుకు, అనిల్‌ కందుకూరుకు, బాలకృష్ణ మంగళగిరికి బదిలీ అయ్యారు. వారి స్థానంలో నరసరావుపేట మంగళగిరిలో విధులు నిర్వహిస్తున్న శ్రావ్య, విజయసారథి గుంటూరుకు బదిలీ అయ్యారు. మంగళగిరిలో అసిస్టెంట్‌ మోటర్‌ వాహన తనిఖీ అధికారిగా పనిచేస్తున్న పవన్‌ నరసరావుపేటకు బదిలీ అయ్యారు. నెల్లూరులో విధులు నిర్వహించే సాయి ధరమ్‌ తేజ్‌ తెనాలికి బదిలీ అయ్యారు.

ఆర్టీసీ బస్టాండ్‌ను

సందర్శించిన జోన్‌ చైర్మన్‌

పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ను మంగళవారం ఆర్టీసీ నెల్లూరు జోన్‌ చైర్మన్‌ ఎస్‌.సురేష్‌రెడ్డి సందర్శించారు. గుంటూరు–1, 2 డిపోల పరిధిలోని గ్యారేజీలను తనిఖీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లో తిరుగుతూ ప్రయాణికులను బస్సులో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌ పరిధిలో స్టాల్స్‌ను స్వయంగా తనిఖీ చేశారు. ఎమ్మార్పీకంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ ఆర్‌ఎం రవికాంత్‌తో కలిసి రికార్డులు పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement