
నిరోధించటంలో ప్రభుత్వం విఫలం
మహిళలపై అఘాయిత్యాలు
నరసరావుపేట: రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు నిరోధించటంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు బొబ్బిలి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదురుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యలను నిరసిస్తూ అంబేడ్కర్ చిత్రపటానికి వినతిపత్రం సమర్పించారు. శ్రీలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏడాదిలో అనేక చోట్ల మహిళలపై అత్యాచారాలు, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. అనంతపురం, భీమిలి బీచ్లో మహిళలపై జరిగిన సంఘటనలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా నాయకురాలు గూడూరు మాణిక్యం మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయని, అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని హత్యకు గురికావడం దారుణమని అన్నారు. ఆరు రోజులు కిందట కేసు పెట్టినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారని అన్నారు. నాయకురాలు మల్లెల అనిల మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వమనేది ఉందా అని ప్రశ్నించారు. మహిళలకు న్యాయం జరిగేవరకు పోరాడుతామని అన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు బొబ్బిలి శ్రీలక్ష్మి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటం వద్ద నిరసన