
ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
ప్రత్తిపాడు: ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఐటీఐ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడుకు చెందిన మన్నవ జేమ్స్, ఏసుకుమారిలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మన్నవ స్టాలిన్ (17) గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్లపాడులోని ఎంజీఎస్ కళాశాలలో ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు స్టాలిన్ను గారాబంగా పెంచుకున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ 27వ తేదీ రాత్రి ఏసుకుమారి పనిపై బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లి చూసేసరికి స్టాలిన్ ఇంటి వరండాలోని సీలింగ్ ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి స్టాలిన్ను కిందకు దింపి తండ్రికి సమాచారం అందించారు. అపస్మారక స్థితిలోనికి వెళ్లిన స్టాలిన్ను తీసుకుని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే స్టాలిన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోసుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. జేమ్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె. నాగేంద్ర తెలిపారు. విద్యార్థి మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.