
జీజీహెచ్లో కరోనా వైద్య సేవలు
గుంటూరు మెడికల్: కొన్నేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పలువురు బాధితులు కరోనాతో బాధపడుతుండటంతో గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా 15 పడకలతో వార్డు ఏర్పాటు చేశారు. ఇన్పేషెంట్ విభాగంలో బీ క్లాస్ రూములో కూడా బాధితుల కోసం సిద్ధం చేసి ఉంచారు. అత్యవసర విభాగం వల్ల నూతనంగా నిర్మించిన స్టెప్ డౌన్ ఐసీయూ గదిని కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. ఇప్పటికే కరోనా అనుమానంతో వచ్చిన ఐదుగురికి వైద్య పరీక్షలు చేశామని, రిపోర్టు నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. జీజీహెచ్లో కరోనా బాధితులకు ప్రత్యేకంగా ఓపీని ప్రారంభించామన్నారు. ఆక్సిజన్ కాన్సెట్రేటర్స్, సీక్యాప్ మిషన్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. జనరల్ మెడిసిన్ వైద్యులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి కరోనా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
వైద్య సేవలకు సిద్ధంగా ఉండండి
రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య సేవలు అందించేందుకు ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు సిద్ధంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డీఎంఈ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశంలో డీఈఓ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ గుంటూరు జీజీహెచ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఎక్కువ మంది చికిత్స పొందేలా చూడాలన్నారు. ఈ – హాస్పిటల్ వైద్య సేవలు పెంచాలన్నారు. సమావేశానికి హాజరు కాని జీజీహెచ్ వైద్యులకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. సమీక్షలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతోపాటు పలు వైద్య విభాగాధిపతులు, ఆయా టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.