
రెడ్బుక్ రాజ్యాంగం మేరకే అక్రమ కేసులు
మాచర్ల: నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా పనిచేసి రెండు దశాబ్దాలుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పల్నాడు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్ము చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు, ఎస్సీ సెల్ కారంపూడి మండల అధ్యక్షుడు దరివేములు కిరణ్లు అన్నారు. మంగళవారం మాచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెట్టిందన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందన్నారు.
అక్రమ కేసులు నమోదు చేయడం హేయం
గుల్లపాడు గ్రామంలో ఏ ఒక్క విషయానికి పీఆర్కే వెళ్లడం లేదన్నారు. ఆయన సోదరుడు నియోజకవర్గంలోనే లేడన్నారు. వీరివురి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా అక్రమ కేసులు పెట్టిస్తుందన్నారు. ఇప్పటికే పీఆర్కేపై 13 కేసులు అక్రమంగా నమోదు చేయించారన్నారు. ఆ గ్రామానికి, పార్టీకి సంబంధం లేని ఘటనను ఆధారంగా చేసుకుని 302 హత్య కేసు నమోదు చేయడం హేయమైన ఘటన అన్నారు. పీఆర్కేకు ఏడాదిలోనే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి సహించలేక, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును పీఆర్కే సోదరులపై నమోదు చేయించారన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పీఆర్కేను ఏం చేయలేవన్నారు. పార్టీ జిల్లా ఎస్సీ విభాగం కార్యవర్గ సభ్యులు మామిడి శేఖర్, మాచర్ల నియోజకవర్గ నాయకులు ఎ.రమేష్, రాజేష్, కె.మధు, తదితరులు పాల్గొన్నారు.