నీట్‌గా పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నీట్‌గా పరీక్ష

May 5 2025 8:40 AM | Updated on May 5 2025 10:36 AM

నీట్‌గా పరీక్ష

నీట్‌గా పరీక్ష

● పల్నాడు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ● 764 మందికిగాను 745 మంది హాజరు ● జేఎన్‌టీయూ–ఎన్‌ కేంద్రంలో 600 మందికిగాను 591 మంది హాజరు ● కేంద్రీయ విద్యాలయం (ఇర్లపాడు) లో 164 మందికి గాను 154మంది హాజరు ● దాహార్తితో అల్లాడిన తల్లిదండ్రులు

నరసరావుపేట ఈస్ట్‌: జాతీయస్థాయిలో వైద్య విద్యా కోర్సులు, దంత వైద్య విద్యా కోర్సులు చదవాలనుకునే విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన నీట్‌–2025 ప్రవేశ పరీక్ష పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపే జేఎన్‌టీయూ–ఎన్‌ కళాశాల, నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ పరిధిలోని కేంద్రియ విద్యాలయంలో నీట్‌ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయూ–ఎన్‌ కళాశాలలో నమోదైన 600 మంది విద్యార్థులకుగాను 591మంది హాజరుకాగా, కేంద్రియ విద్యాలయంలో 164 మందికి గాను 154 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించగా విద్యార్థులను ఆయా పరీక్ష కేంద్రాలలోకి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు అనుమతించారు. కేంద్రం వద్ద హాజరైన విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష హాలుకు అనుమతించారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాచీలు, బూట్లు, ఫోన్లు అనుమతించలేదు. జేఎన్‌టీయూ–ఎన్‌ పరీక్ష కేంద్రం నరసరావుపేట–వినుకొండ ప్రధాన రహదారికి దాదాపు రెండు కిలోమీటర్లు దూరం ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులకు గురయ్యారు. పరీక్ష కేంద్రంలోకి అనుమతించేందుకు ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం సైతం దూరంగా ఉండటంతో మండుటెండలో విద్యార్థులు విలవిలలాడారు. 600 మంది విద్యార్థులు హాజరవుతున్న కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చిన్న టెంట్‌ విమర్శలకు తావిచ్చింది. జేఎన్‌టీయూ–ఎన్‌ కళాశాల బహిరంగ ప్రదేశంలో ఉండటంతో ఒకవైపు వేసవి ఎండ తీవ్రత, మరోవైపు వడగాలులతో ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మంచినీటి వసతి కల్పించక పోవటం పట్ల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. నాలుగు మంచినీటి కుండలను ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవటంతో తల్లిదండ్రులు దాహార్తితో ఇబ్బంది పడ్డారు. ప్రైవేటు కళాశాల యాజమాన్యం మజ్జిగ పంపిణీ చేయటంతో కొంత వరకు సేదదీరారు. తాగునీటి కోసం కనీసం 5 కిలోమీటర్లు వెళ్లాల్సి రావటంతో ఇబ్బందులు పడ్డారు. నీట్‌ పరీక్ష ప్రశాంతంగా ముగియటం పట్ల సిటీ కోఆర్డినేటర్‌ నీరజ్‌కుమార్‌ శ్రీవాత్సవ ఆనందం వ్యక్తం చేసారు. పరీక్ష నిర్వహణలో సహకరించిన రెవెన్యూ, పోలీస్‌, ఆర్టీసీ ఇతర శాఖల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement