
ముగిసిన ప్రతిష్టా మహోత్సవాలు
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కేఆర్ కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మంహంకాళీ అమ్మవారి దేవస్థాన పునర్నిర్మాణ నూతన రాజగోపుర శిఖర కలశ ప్రతిష్టా కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం గం 5:30 నిమిషాలకు నిత్య పూజావిధులు, యంత్రపూజలు, పీఠన్యాస, గర్తన్యాస, రత్నవ్యాసాదులు, 7:49 నిమిషాలకు యంత్రబింబ, ధ్వజస్తంభ ప్రతిష్ట, తదితర కార్యక్రమాలు జరిగాయి. ప్రతిష్టానంతరం అన్నసంతర్పణ జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి నారా లోకేష్ పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు నిర్వహించారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు. ఆలయ పునర్నిర్మాణ ప్రధాన దాతలు దొంతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, వాసంతి, శ్రీప్రద్ విశ్వత్ రెడ్డి, ముఖ మండపం, విమాన గోపురం, రాజ గోపురం, నూతన ధ్వజస్తంభం పరివాహక దేవతలను బహూకరించారు. వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ దేవభక్తుని రంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి మొత్తం రూ.4 కోట్లు అయ్యిందని, దానిలో ఎండోమెంట్ వారు రూ.కోటి, దాతలు రూ.3కోట్లు సహాయం చేశారని తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణ అధికారి కె.సునీల్ కుమార్ ఏర్పాట్లు పరిశీలించారు. తహసీల్దార్ ఐ.సునీత, ఎంపీడీఓ ఎ.శ్రీనివాసరావు, ఏపీఎం సురేష్ కుమార్ అలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ వెంకట రవికుమార్, పోలీసులు బందోబస్తు పర్యవేక్షించారు.

ముగిసిన ప్రతిష్టా మహోత్సవాలు