
సోషల్ మీడియా యాక్టివిస్ట్పై అక్రమ కేసు
పిడుగురాళ్ల: సోషల్ మీడియా యాక్టివిస్టు షేక్ మాబును అక్రమ కేసులో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాబు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడనే నెపంతోనే కూటమి నాయకులు పోలీసుల చేత అక్రమంగా అరెస్టు చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2024 సెప్టెంబర్ 11న సోషల్ మీడియా యాక్టివిస్టు వెన్నా రాజశేఖర్రెడ్డి, మాబుని అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు ఇబ్బందులు గురి చేశారు. ఈ సమయంలో మాబు తల్లిదండ్రులు హైకోర్టులో హెబిఎస్ కార్పస్ వేశారు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని కొంత కాలంగా వెన్నా రాజశేఖర్రెడ్డిని, మాబుని ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పిడుగురాళ్ల పోలీసులు ఈ క్రమంలోనే తిరిగి బైకు దొంగతనం చేశారన్న నెపంతో మాబుని బ్రాహ్మణపల్లిలోని సిమెంట్ షాపు వద్ద నుంచి కొట్టుకుంటూ పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకొని వచ్చారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్నను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని, పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును మాబు తమ్ముడు జానీ ప్రశ్నించారు. దాంతో బైకు దొంగతనం కేసు సంబంధించి విచారణకు తీసుకొని వచ్చామని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనే కారణంతోనే ఈ అక్రమ కేసులు బనాయించి తన అన్న మాబును పోలీస్స్టేషన్కు తరలించారని జానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావును సాక్షి వివరణ కొరగా మాబుతోపాటు అతని అన్న బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు.