
జూనియర్స్ విభాగం విజేత హైదరాబాద్ ఎడ్లజత
దాచేపల్లి: స్థానిక శ్రీ వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు బుధవారం రాత్రి హోరాహోరీగా జరిగాయి. జూనియర్స్ విభాగంలో జరిగిన ఈ పోటీలను గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యేకంగా పూజలు చేసి ప్రారంభించారు. పోటీలో హైదరాబాద్కి చెందిన డి.రోహన్భాబు ఎడ్ల జత 3,158 అడుగుల దూరం బండ లాగి విజేతగా నిలిచింది. బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలేనికి చెందిన అత్తోట శిరిష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 2,772 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన బుర్రిముక్కు కౌసల్యారెడ్డి ఎడ్ల జత 2,565 అడుగుల దూరం బండలాగి మూడో స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లింగయపాలెంకి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్ల జత 2,398 అడుగుల దూరం బండలాగి నాల్గవ స్థానం, బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరిషచౌదరి, శివకృష్ణ చౌదరి, గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడుకి చెందిన దొడ్డంపూడి గణేష్ సంయుక్త ఎడ్ల జత 2,250 అడుగుల దూరం బండలాగి ఐదో స్థానం, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం లింగాయపాలెంకి చెందిన యల్లం సాంబశివరావు ఎడ్లజత 2వేల అడుగుల దూరం బండ లాగి ఆరో స్థానం, గుంటూరు పట్టణానికి చెందిన సోమిశెట్టి ఆంజనేయులు ఎడ్ల జత 1,774 అడుగులు దూరం బండలాగి ఏడవ స్థానంలో నిలిచాయి. విజేతలైన ఎడ్ల జతల రైతులకు దాతలు నగదు, షీల్డ్స్ బహుకరించారు. పోటీలకు న్యాయనిర్ణేతగా గూడా శ్రీనివాసరావు వ్యవహరించగా కమిటీ సభ్యులు కొప్పుల గిరి, అనిశెట్టి శ్రీనివాసరావు, కానుకొల్లు ప్రశాంత్, మునగా నిమ్మయ్య తదితరులు పర్యవేక్షించారు.

జూనియర్స్ విభాగం విజేత హైదరాబాద్ ఎడ్లజత