● వీడిన కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యుయలరీ షాపు దొంగతనం కేసు ● పట్టుబడిన ఒడిశా డెకాయిట్లు ●ప్లాన్ చేసిన యూపీ గ్యాంగ్ కోసం గాలింపు ● 243 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ :
ఒడిశా డెకాయిట్లకు యూపీ దొంగలు జత కలి శారు. పక్కాగా స్కెచ్ వేసి, ఆపై రెక్కీ చేసి బంగా రం కొల్లగొట్టారు. గత నెల 7న కాశీబుగ్గ నిత్యానందనగర్ కాలనీలో మారుమూలనున్న శ్రీవేంకటేశ్వర జ్యూయలర్స్ దుకాణంలోకి పట్టపగలు చొరబడి దోపిడీకి ఎగబడ్డారు. చోరీకి ఎగబడిన వారిలో ఒడిశాకు చెందిన డెకాయిట్లు ఐదుగురు కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో కేసు మిస్టరీ వీడింది. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..
గత నెల 7న కాశీబుగ్గ నిత్యానందనగర్లో శ్రీవెంకటేశ్వర జ్యూయలర్స్లో పట్టపగలు పోలీసు అధికారులమని లోపలకు ప్రవేశించి యజమాని చేతులకు బేడీలు వేసి 800 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత నగదు దోచేసి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీనిపై యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ దర్యాప్తులో 4 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
నిందితులు ఉపయోగించిన వాహనాల వివరాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ముందుగా కారును ట్రేస్ చేసిన పోలీసులు క్రయ విక్రయాలు, ఆధార్, మొబైల్ నంబర్లు సేకరించి మిగతా నిందితుల ఫోన్ నంబర్లు గుర్తించి కేసును ఛేదించారు.
ఒడిశా నుంచి వలస వచ్చి..
ఒడిశాలోని అస్కాలో గోల్డ్షాపు రన్ చేసిన పొట్నూ రు తిరుమల పాత్రో (56) వ్యాపారం సరిగా సాగక నాలుగేళ్ల క్రితమే కాశీబుగ్గ చేరి జీడిపప్పు క్రయవిక్రయాలు జరుపుతూ స్థానికులతో నమ్మకంగా మెలిగాడు. దొంగలు తెచ్చే బంగారాన్ని కాశీబుగ్గలోని వివిధ నగల దుకాణాలకు అమ్ముతూ ఆ సొమ్మును దొంగలకు చేరుస్తూ కొంత భాగం తాను ఉంచుకుంటూ పబ్బం గడుపుతుండేవాడు. ఇక్కడి షాపుల వివరాలు డెకాయిట్లకు చెబుతుండేవాడు. దీనిలో భాగంగా రామకృష్ణ షాపుపైనా కన్నేసి పథకం రచించి తోటి సహచరులతో రెక్కీ చేయించాడు.
పక్కా ప్లాన్ ప్రకారం..
ఒడిశా గంజాం జిల్లాకు చెందిన కూన బారిక్ (36), రామచంద్రసాహు, మరికొందరితో గత ఏడాది డిసెంబరు 25న, ఈ ఏడాది మార్చి 22, 24 తేదీల్లో తిరుమల పాత్రో రెక్కీ చేశాడు. నిందితులు గత నెల 5న భువనేశ్వర్ నుంచి బయల్దేరి మహేంద్రగిరి చేరి అక్కడ రాత్రి బస చేశారు. 6న ఉదయం బయల్దేరి కేదారిపురం వద్దకు 3 ద్విచక్రవాహనాలు, ఓ నల్లని కారులో చేరారు. కారును కేదారిపురం సమీప లేఅవుట్లో పార్కింగ్ చేసి బైక్లపై కాశీ బుగ్గ పట్టణానికి ఉదయమే చేరినా షాపు త్వరగా మూసేయడంతో వెనుదిరిగారు. 7న అదే మార్గంలో వచ్చి పక్కా గా ప్లాన్ను అమలు చేసి ఉడాయించేశారు. అయితే ఏడుగురు నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారని, యూపీ గ్యాంగు కూడా వెనకుండటంతో వారు ఎ లా ఎస్కేప్ అయ్యారు. ఎవరికి బంగారాన్ని చేర్చా రన్నదీ ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు.
అందరూ డెకాయిట్లే..
ఒడిశా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దోపిడీ నేరాలకు పాల్పడిన అనుభవమున్న వీరందరిపై 32 కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో రామచంద్రసాహు, బనోజ్ బిహారీ పట్నాయిక్ లపై చెరో 6 డెకాయిట్ కేసులుండగా పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భంలో ఇరువురూ ఫైరింగ్ చేసిన ఘనత కూడా ఉంది. అత్యధికంగా కూన బారిక్పై 14 డెకాయిట్, 8 చోరీ కేసులుండగా, తపన్ మహరాణాపై ఒక డెకాయిట్, ఒక హర్ట్ కేసు ఉంది. కాశీబుగ్గలో పాతుకుపోయిన పాత్రోపై 4 డెకాయిట్ కేసులుండటం గమనార్హం.


