పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో రాజకీయ కక్షతో అర్హులైన వారి పింఛన్లను నిలుపుద ల చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఏడుగురు లబ్ధి దారులు తమ పింఛన్లు కోల్పోయారు. శనివారంతో మూడు నెలలు గడువు ముగియడంతో బాధిత పింఛన్దారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయం వద్ద పడిగాపులు కాశారు. ఎన్ని రామారావు, సంపతిరావు వేదాంతినాయుడు, గురుగుబెల్లి బంతమ్మ, సీపాన సూర్యనారాయణ, యారబాటి దాలయ్య, సంపతిరావు నేపాలరాజు, పాతిన జగన్నాథంలు పంచాయతీ కార్యదర్శిని, ఎంపీడీఓను పలుమార్లు కలిసినప్పటికీ పింఛన్లు పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీడీఓకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని, కనీసం ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదని బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. దీంతో సచివాలయం వద్దే తమ నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ జరుపకుండానే తమ పింఛన్లను నిలుపుదల చేశారని వాపోతున్నారు. ఇదే విషయంపై వివరణ కోరేందుకు ఎంపీడీఓకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు.


