భువనేశ్వర్: ఉత్తీర్ణ వైద్యుల అసంతృప్తి కట్టలు తెంచుకుంది. 10 ప్రధాన డిమాండ్లతో ఈ వర్గం సోమవారం నిరసన ప్రదర్శించింది. ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఓపీఎస్సీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు. తమ వృత్తి భవిష్యత్పై నెలకొన్న అనిశ్చితి తొలగించడంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారుల సమాచారం ప్రకారం, ఓపీఎస్సీ గత సంవత్సరం మే నెలలో మొత్తం 5,284 మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. వారిలో దాదాపు 3,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 1,840 మంది విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 822 మంది అభ్యర్థులకు మాత్రమే నియామక పత్రాలు జారీ చేశారు. మిగిలిన 1,018 మంది ఉత్తీర్ణ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేయలేదు. ఈ మేరకు స్పష్టమైన వివరణ లేకుండా అనుబంధ వర్గాలు వేధిస్తున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలో ష్పక్షపాత వైఖరితో పారదర్శకత ప్రదర్శించాలని ఓపీఎస్సీ అధికారులను కోరారు. ఈ సమస్య పరిష్కరించి తమ వృత్తిపరమైన అనిశ్చితి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.


