● వైద్యులతో సమీక్ష
జయపురం: జయపురం పట్టణంలోని జగధాత్రిపూర్ (పాత జయపురం సబ్డివిజన్ ఆస్పత్రి) ఆస్పత్రి కార్యకలాపాలను పరిశీలించే క్రమంలో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ బృందం శుక్రవారం సందర్శించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ ఆరోగ్యశాఖ తరఫున ఆస్పత్రిలో నాణ్యతను పరిశీలించేందుకు డాక్టర్ రూప్ కుమార్ బయ్యా, సంతోష్ కుమార్ వచ్చారు. గతంలో జయపురం జగదాత్రిపూర్ ఆస్పత్రి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణాలతో ఉత్తీర్ణత సాధించింది. ఆస్పత్రికి చేరిన బృందం ఇక్కడ అందుతున్న సేవలపై అధికారులతో సీమీక్షించింది. ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ స్వర్ణప్రభా బెహర తెలిపిన వివరాల ప్రకారం ఆస్పత్రిలోని 12 విభాగాలలో సేవలను కేంద్ర బృందం వెల్లడించింది. అవి సాధారణ క్లినిక్, డ్రస్సింగ్ రూం, కుటుంబ నియంత్రణ విభాగం, సంక్రమణ వ్యాధులు (అంటు వ్యాధులు)టీకాకరణ, ప్రయోగ శాల, ఔషధ పంపిణీ విభాగం, రికార్డుల నిర్వహణ, నవజాత శిశు, బాలల ఆరోగ్యం, మహిళల ఆరోగ్య విభాగాలను కేంద్ర బృందం సమీక్షిస్తుందని వెల్లడించారు. 12 విభాగాల సమీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారంతో పాటు అదనపు నిధులు సమకూరుతాయన్నారు. కేంద్ర బృందానికి ఆస్పత్రి ఇన్చార్జి అధికారి డాక్టర్ స్వర్ణప్రభా బెహర, వైద్యాధికారి డాక్టర్ అరుణ కుమార్ పాఢీ, డాక్టర్ శతాబ్ది మిశ్ర, టీకా అధికారి ప్రసన్న కుమార్ సాహు, డాటా ఆపరేటర్ లింగరాజు పాఢీ, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.


