సిక్కోలు మాస్టర్స్ అథ్లెట్స్ హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మా మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పతకాలతో సత్తాచాటారు. బాపట్ల వేదికగా ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు 7వ ఏపీ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లా నుంచి తొమ్మిది మంది వెటరన్ అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించగా 24 పతకాలు సాధించారు. వీటిలో ఐదు బంగారు, తొమ్మిది రజత, పది కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన వారిలో జి.అర్జున్రావురెడ్డి (మూడు పతకాలు), జేవీఎస్ జగన్నాథం (మూడు పతకాలు), ఎం.గోవిందరావు (నాలుగు పతకాలు), పి.రామచంద్రరావు (మూడు పతకాలు), బి.జానకిరావు (కాంస్యం), కె.సింహాచలం (కాంస్యం), జి.హైమావతి (మూడు పతకాలు), ఎస్.రమాదేవి (మూడు పతకాలు), ఎ.వాణి (మూడు పతకాలు) ఉన్నారు. క్రీడాకారులు పతకాలు సాధించడం పట్ల శ్రీకాకుళం మా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆదివారం అభినందించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎండీ కాసంఖాన్, కళావతి, ప్రధాన కార్యదర్శి గాలి అర్జున్రావరెడ్డి మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీలకు సన్నద్ధంకావాలని పిలుపునిచ్చారు.
హౌస్ సర్జన్ల నిర్వాకంపై విచారణకు ఆదేశం
శ్రీకాకుళం: శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో అదపాక అలివేలు అనే రోగికి ‘బీ’ పాజిటివ్ రక్తానికి బదులుగా ‘ఓ’ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్ విచారణకు ఆదేశించారు. విషయం తెలుసుకున్న ఆయన శనివారం రాత్రి రిమ్స్కు వెళ్లి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ ఘటనపై ఓ కమిటీని నియమించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.


