వందేభారత్ రైలు ఢీకొని విద్యార్థిని మృతి
కంచిలి: మండల కేంద్రం కంచిలి వద్ద రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని సాలిన గంగోత్రి(తనూజ) మృతిచెందింది. బలియాపుట్టుగ కాలనీలో నివాసం ఉంటున్న ఈమె గొల్లకంచిలి గ్రామంలో ఉన్న తన మేనత్త ఇంటికి రైల్వే ట్రాక్ దాటి వెళుతుండగా గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని మృతిచెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మధుసూదన్రావు శుక్రవారం తెలిపారు. తండ్రి పురుషోత్తం కళాసీ పనిచేస్తున్నాడు. ముగ్గురు కుమార్తెల్లో తనూజ పెద్దమ్మాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థిని మృతిచెందడంతో ప్రధానోపాధ్యాయుడు ఎస్.చాణిక్య, సహోపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. మృతురాలి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు.
వ్యక్తి ఆత్మహత్య
జలుమూరు: యలమంచిలి గ్రామానికి చెందిన బొమ్మాళి ఎండువాడు (61) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పక్షవాతం, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు భరించలేక మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ అశోక్బాబు తెలిపారు. కుమారుడు బొమ్మాళి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి వైపు నుంచి ద్విచక్ర వాహనంపై డి.రాము, డి.శ్రీను, బి.గణేష్ శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురయ్యారు. వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా.. అతివేగంతో ముందువెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారా? అనే విషయం తెలియడం లేదు. గణేష్ అనే వ్యక్తికి కాళ్లు విరిగిపోయి, ఎడమ చెయ్యి తెగిపడటంతో గుర్తు తెలియని వాహనం పైనుంచి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునిస్వల్పగాయాలైన వారిని సమీప ఆసుపత్రికి, తీవ్ర గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు.
వందేభారత్ రైలు ఢీకొని విద్యార్థిని మృతి


