మృతులకు పరిహారం ఇప్పించండి
కంచిలి: మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి చిల్లపుట్టుగ గ్రామంలో మే 26వ తేదీన జరిగిన విద్యుత్ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి(పార్లమెంట్) సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ పి.వి.సూర్యప్రకాశ్కు వినతిపత్రం సోమవారం అందజేశారు. దీనికి సూర్యప్రకాష్ స్పందించి నష్ట పరిహారం మంజూరు కు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
యువతి ఆత్మహత్య
రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన శీల కీర్తి(16) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని జే.ఆర్.పురం పోలీసులు తెలిపారు. ఈనెల 6వ తేదీన ఇంట్లో టీవీ చూస్తోందని తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన కీర్తి పురుగుల మందు తాగి పడుకొనిపోయింది. రాత్రి సమయంలో వాంతులు చేసుకుంటుండగా తల్లిదండ్రులు గమనించి రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. మృతురాలు కీర్తి రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. తండ్రి పైడితల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
తల్లి రుణం తీర్చుకున్న తనయ
నరసన్నపేట: స్థానిక పురుషోత్తం నగర్కు చెందిన మన్నిక రమణమ్మ తన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. అనారోగ్యంతో బొమ్మాళి రాములమ్మ (65) సోమవారం మృతి చెందారు. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నప్పటికీ అదృశ్యమై ఏడాది పైనే అవుతోంది. కుమార్తె రమణమ్మ భర్త చనిపోవడంతో తల్లి వద్దే ఉంటుంది. ఈ దశలో తల్లి మరణించడంతో రమణమ్మ తలకొరివి పెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసింది.
చీటింగ్ కేసులో వ్యక్తి అరెస్ట్
పాతపట్నం: చీటింగ్ కేసులో టెక్కలి మండలం లింగాలవలస గ్రామానికి చెందిన వై.గోపిని నాన్ బెయిలబుల్ వారెంట్పై అరెస్ట్ చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాతపట్నంలోని ప్రశాంతినగర్లో నివాసముంటున్న సీహెచ్ శ్రీనివాసరావుకు 2014 సంవత్సరంలో పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధి అమ్మవారి ఆలయం సమీపంలోని ఇంటి స్థలం అమ్ముతామని చెప్పి, నకిలీ అగ్రిమెంట్ చూపించి, నగదు టోకెన్గా తీసుకున్నారని అప్పట్లో శ్రీనివాసరావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు గతంలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఇప్పుడు వై.గోపిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: మండలంలోని కుశాలపురం గ్రామానికి చెందిన అన్నెపు సరస్వతి(80) సోమవారం మృతి చెందారు. దీంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు వి.పద్మావతి, బి.నాగలక్ష్మి, వి.లిఖిత నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ పూతి సుజాత, ఉమా శంకర్ల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సెక్రటరీ బి.మల్లేశ్వరరావు, ట్రెజరర్ కె.దుర్గా శ్రీనివాస్ తదితరులు అభినందించారు. నేత్రదానం ద్వారా మరొకరికి ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని, అంధత్వ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
బాల్య వివాహాలు
చట్టరీత్యా నేరం
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. నగరంలోని కలెక్టరేట్లో బాల్య వివాహాల అనర్థాలపై పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
మృతులకు పరిహారం ఇప్పించండి
మృతులకు పరిహారం ఇప్పించండి


