
ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటర
జలుమూరు: ప్రసిద్ధి శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడిని తమిళనాడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ టి.ఎన్ వెంకటేష్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించారు.
ఈదుపురంలో పోలీసు పహారా
ఇచ్ఛాపురం రూరల్: ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జూన్ 17న గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాట, రెండు రోజుల క్రితం కూటమి నాయకుడు విడుదల చేసిన వివాదాస్పద వాయిస్ రికార్డు దృష్ట్యా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా ఏఎస్ఐ శంకరరావు, ముగ్గురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
కరువు భత్యం చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు, సహాధ్యక్షుడు నెమలిపురి విష్ణుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 జులై నుంచి ఇప్పటివరకు నాలుగు విడతలుగా బకాయిలు పడ్డ డీఏలన్నీ కలిపి 16.38 శాతం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇసుక వాహనాల అడ్డగింత
బూర్జ : ఇసుక వాహనాల రాకపోకలతో దుమ్ము ధూళి చెలరేగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బూర్జ మండలం చీడివలస గ్రామస్తులు శనివారం పలు లారీలను అడ్డుకున్నారు. కాఖండ్యాం, తమరాం ఇసుక ర్యాంపుల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలను అడ్డుకోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు.
జాబ్మేళాకు విశేష స్పందన
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. జీఎంఆర్ ఏఈఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ ఎయిర్పోర్టుల్లో ఫైర్ ఫైటర్స్ పోస్టుల భర్తీకి ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన 18 నుంచి 24 ఏళ్ల యువత జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. 1600 మీటర్ల పరుగు, బరువు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వివరాలు తర్వాత వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు.
రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు
కొత్తూరు: కడుము గ్రామంలో అరసా ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం, ఎస్ఐ టి.రామారావు, సీఎస్డీటీ భీమారావులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల 50 కిలోల బరువు గల 700 పీడీఎస్ బియ్యం బస్తాలను పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ను విచారణ చేయగా.. కొత్తూరు మండలంలో టీడీపీ నేత, కడుము ఎంపీటీసీకి చెందిన అరసా రైస్ మిల్లు నుంచి బియ్యం తీసుకొస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వీఆర్వో చిన్న లోకేష్ పాల్గొన్నారు. కాగా, కొత్తూరు, తదితర మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని చిల్లర వర్తకుల ద్వారా కొనుగోలు చేసి పాచిపెంట మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం.

ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటర

ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటర

ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటర