
పోలీసులకు చిక్కిన మత్తు ఇంజక్షన్ల విక్రేతలు
జయపురం: జయపురంలో మత్తు ఇంజక్షన్లు, మత్తు పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ పరిస్థితిలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. మే నెల ఐదో తేదీన మత్తు ఇంజక్షన్ స్వాధీనంతోపాటు దీనితో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్టు చేసిన పట్టణ పోలీసులు మరోసారి చర్యలకు ఉపక్రమించారు. తాజాగా ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 513 పెంటాజొకెన్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్ చంధ్ర రౌత్ బుధవారం వెల్లడించారు. అరెస్టయిన వారిలో స్థానిక ఆదర్శనగర్కు చెందిన రాకేష్ పటా్నూక్, డొంగాగుడ వాసి రామ హరిజన్, సునాబెడకు చెందిన అభినవ ప్రధాన్, సెమిలిగుడ మెనార్ కేంప్ రోడ్లో నివసిస్తున్న త్రినాథ్ కొరబ, ధమంజొడి బెజాపుట్ సత్సంఘ్ కాలనీ వాసి సంజయ జెన ఉన్నారన్నారు. అరెస్టు అయిన నిందితుల నుంచి 513 పెంటాజొకెన్ ఇంజక్షన్ ఆంపిల్స్తో పాటు ఒక కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు పోలీసు అధికారి ఉల్లాష్ చంద్రరౌత్ వెల్లడించారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి ఎస్సై గోవింద చందహంసద్, ఏఎస్సై దేవీ ప్రసాద్ పండల నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్ జరుపుతున్న సమయంలో కొలాబ్ ప్రధాన కెనాల్ గాంధీ చౌక్, హెక్టాగుడ మార్గంలోని ఓ హోటల్ వద్దకు పోలీసులు చేరారు. ఆ సమయంలో ఒక కారు రోడ్డు పక్కన నిలిచి ఉంది. కారు వద్ద ఉన్న ఆరుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరారవుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని వెంబడించి ఐదుగురిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారైనట్టు పోలీసులు చెప్పారు. కారుని తనిఖీ చేయగా డిక్కీలో ప్యాకెట్లలో ఉన్న మత్తుమందు ఇంజక్షన్లు బయట పడ్డాయాన్నారు. మెజిస్ట్రేట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ల సమక్షంలో ఇంజక్షన్లను లెక్కించటం జరిగిందని వివరించారు. సిడ్యూల్– హెచ్ కేటగిరీకి చెందిన ఆ ఇంజక్షన్లను డాక్టర్ల ప్రిస్క్రిప్సన్ లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు. ఈ సంఘటనపై ఎన్డీపీఎస్, డ్రగ్స్, కాస్మయోటిక్స్ 1940 చట్టం పరిధిలో కేసులు పెట్టినట్టు చెప్పారు. మత్తు ఇంజక్షన్లను యువతను దృష్టిలో పెట్టుకొని వాటిని తెప్పించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
ఐదుగురు అరెస్టు
513 పెంటాజొకెన్ ఇంజక్షన్ స్వాధీనం

పోలీసులకు చిక్కిన మత్తు ఇంజక్షన్ల విక్రేతలు