మాట నిలబెట్టుకున్నాం: సీఎం | - | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్నాం: సీఎం

Jun 13 2025 7:13 AM | Updated on Jun 13 2025 7:21 AM

● రాష్ట్రంలో బీజేపీ పాలన ఏడాది పూర్తి ● వికాస వాహనం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం

భువనేశ్వర్‌:

రాష్ట్ర ప్రభుత్వం తొలి వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ వికాస వాహనం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వాహనం రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తుంది. మరో వైపు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరని ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందించడంలో ఇది బలమైన పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.

వాగ్దానాలు వాస్తవ కార్యాచరణ

ఏడాది కిందట ఇదే రోజున జగన్నాథుని దయ, రాష్ట్ర ప్రజల నమ్మకం, మద్దతుతో రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ఇలా కొనసాగింది. ‘గొప్ప ఒడిశా రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను. ప్రజలకు సేవ చేయడమే నా ఏకై క లక్ష్యం, ఉద్దేశం. కళాశాలలో చదువుతున్నప్పుడు నేను జాతీయ సేవ, ప్రజా సేవ యొక్క స్ఫూర్తిని నింపుకుని స్వచ్ఛంద సేవకుడిగా, ఉపాధ్యాయుడిగా, సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా, నేడు ముఖ్యమంత్రిగా ప్రజలు సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం పోరాడాను, పోరాడుతున్నాను. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో మేము అనేక విజయాలు సాధించాము. కానీ అట్టడుగు స్థాయిలో పనిచేసే ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు కూడా ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడనే ఆశ మాకు అతిపెద్ద విజయం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని మొట్టమొదట చెప్పాను. అందుకే నేను ఎల్లప్పుడూ మీ వద్దకు చేరి, అట్టడుగు స్థాయిలో మీ సమస్యలను అర్థం చేసుకుని, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తొలి మంత్రి మండలి సమావేశంలో 4 ప్రధాన వాగ్దానాలను నెరవేర్చాలని మేము నిర్ణయించుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారం ముందుగా మహా ప్రభువు శ్రీ జగన్నాథుడు కొలువై ఉన్న శ్రీమందిరం 4 ద్వారాలను తెరిచాము. అలాగే ఆలయ అభివృద్ధి కోసం రూ. 500 కోట్ల కార్పస్‌ నిధిని సృష్టించాము. సుభద్ర యోజనను ప్రారంభించి కేవలం ఒక సంవత్సరంలో 1 కోటి పైబడి మహిళలకు సాధికారత సాధ్యం చేయగలిగాం. ఆహార దాతలకు రూ. 800 అదనపు సహాయంతో వరి కొనుగోలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాలుకు రూ. 3,100 అందుతోంది. ఏడాది పాలనలో 21 వాగ్దానాలలో 11 నెరవేర్చాము. నేడు ఒడిశా వాస్తవ అభివృద్ధి వైపు పయనిస్తోంది.ఈ ఒక్క సంవత్సరంలోనే సామాన్యులకు, ప్రభుత్వానికి మధ్య కృత్రిమ అడ్డంకిని తొలగించాం. నేడు, ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రిని, మంత్రులను ఎలాంటి అడ్డంకులు లేకుండా కలవవచ్చు. ఈ సమయంలో, ప్రభుత్వం వివిధ రంగాలలో అద్భుతమైన విజయాల్ని సాధించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వాస్తవంగా అమలు చేయడం విశేషం’ అని అన్నారు. ‘మేము చెప్పినది చేశాం. కొత్త ఉపాధి కల్పన, అంత్యోదయ గృహ యోజన కింద నిరాశ్రయులకు పక్కా ఇళ్లు, తునికాకు తుంచే కార్మికులకు సహాయం, ఆయుష్మాన్‌ భారత్‌ యోజన ద్వారా ఆరోగ్య సంరక్షణ, గిరిజన విద్యార్థులకు ఆర్థిక సహాయం, కొత్త విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలు, రోడ్డు, రైలు, విమానయాన పథకాల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మొదలైనవి అభివృద్ధి చెందిన ఒడిశాకు పునాది వేస్తున్నాయి’ అని తెలిపారు.

మాట నిలబెట్టుకున్నాం: సీఎం 1
1/2

మాట నిలబెట్టుకున్నాం: సీఎం

మాట నిలబెట్టుకున్నాం: సీఎం 2
2/2

మాట నిలబెట్టుకున్నాం: సీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement