
జాజ్పూర్ జిల్లాలో అతిసారం
● నలుగురు మృతి ● కలుషిత నీరు కారణం
భువనేశ్వర్: జాజ్పూర్ జిల్లాలో అతిసారం వ్యాప్తి చెంది నలుగురి ప్రాణాలను బలిగొంది. మరో 300 మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రధాన జిల్లా వైద్య అధికారి (సీడీఎంఓ), ప్రకాష్ చంద్ర బాల్ మరణాలను ధ్రువీకరించారు. ధర్మశాల, వ్యాసనగర్, ధనొ గొడి, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్య సంక్షోభం నెలకొని ఉంది. కలుషితమైన నీరు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం వల్ల ఈ వైపరీత్యం తాండవించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నా రు. స్థానిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిందనే ఆరోపణలు వ్యాపిస్తున్నాయి. వ్యాసనగర్లో 65 మందికి పైగా, జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రిలో 80 మంది పైబడి రోగులు చేరారు. 11 మంది పరిస్థితి విషమించడంతో కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. పలు ప్రాంతాల్లో స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కలుషిత నీరు కారణంగా అతిసార విజృంభించిందని స్పష్టమైంది. ప్రభావిత ప్రాంతాలలో కుళాయిల నుంచి బురద, దుర్వాసన వచ్చే నీరు సరఫరా అవుతుందని ఆరోపణలు ఉన్నాయి. జాజ్పూర్లో ప్రధానంగా సుకింద, ధర్మశాల, వ్యాసనగర్ ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటి వనరులు కొరవడిన కారణంగా బావులు మరియు పైపులైన్లు వంటి శుద్ధి చేయని ప్రజలు వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నీరు తరచుగా మల కోలిఫామ్లు లేదా విబ్రియో కలరా వంటి వ్యాధికారకాలతో కలుషితం అవుతుంది. వేసవిలో నీటి ఎద్దడి ఈ పరిస్థితులకు మరింత ఆజ్యం పోసింది. సురక్షిత తాగు నీరు కొరతతో అందుబాటులో ఉన్న నీటి వినియోగానికి ప్రజలు అలవాటు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్లు, బావుల నీరు అపరిశుభ్రం కావడంతో ప్రాణాంతకంగా మారుతోంది. పరిస్థితి వికటించడంతో శుద్ధి చేసిన నీటి సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ఎస్ విభాగం కృషి చేస్తోంది. ప్రజలకు సురక్షిత తాగు నీరు సరఫరా చేయడంలో వ్యవస్థాగత నిర్వహణ సమస్యలు తొలగించనంత వరకు ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడడం సాధ్యం కాదని స్థానికులు వాపోతున్నారు. పాడైన మామిడి పండ్లు, విందులు, వినోదాల్లో అపరిశుభ్రత నీటి వినియోగం కారణంగా అతిసార వ్యాప్తి చోటు చేసుకుందని జిల్లా ప్రధాన వైద్యాధికారి పేర్కొన్నారు. జిల్లా ఆహార భద్రతా విభాగం ఆహార కాలుష్యాన్ని పరిష్కరించడానికి చర్యలను అమలు చేస్తోంది.