
శ్రీ అనంత నారాయణుడి చిత్రపట దర్శనం
భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో చిత్ర పటాల దర్శనం గురువారం నుంచి ప్రారంభమైంది. జ్యేష్ట పూర్ణిమ నాడు మహా జలాభిషేకంతో శ్రీ జగన్నాథుడు అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స, వైద్యం కోసం తెరమరుగయ్యాడు. శ్రీ మందిరం రత్న వేదిక బోసిబోయింది. శ్రీ మందిరానికి విచ్చేసే భక్తులు, యాత్రికులకు ఈ ప్రాంగణంలో చిత్ర పటాల దర్శనం లభిస్తుంది. బలభద్ర స్వామి, దేవీ సుభద్ర మరియు శ్రీ జగన్నాథుని ప్రతీకగా 3 చిత్రపటాలు ఏర్పాటు చేశారు. పవిత్ర స్నాన పూర్ణిమ మర్నాటి నుంచి నవ యవ్వన అలంకరణ ముందు రోజు వరకు శ్రీ మందిరంలో నిరవధికంగా చిత్రపటాల దర్శనం కొనసాగుతుంది. తిరిగి స్వామి ఆరోగ్యంతో కోలుకుని యాత్రకు సిద్ధం అయ్యేంత వరకు తెర చాటున గోప్య సేవలు పొందుతాడు. పక్షం రోజులపాటు గోప్య సేవలు కొనసాగుతాయి. వాటితో కోలుకున్న స్వామి నవ యవ్వన అలంకారంతో చీకటి మండపం నుంచి వెలుపలకు ప్రత్యక్షమై భక్తులకు దర్శనం ఇచ్చేంత వరకు శ్రీ అనంత నారాయణుడి చిత్రపటం శ్రీ జగన్నాథుని ప్రతీకాత్మకంగా పూజలందుకుని భక్తులకు దర్శనం ఇస్తాడు. బలభద్ర స్వామి ప్రతీకగా వాసుదేవుడు, దేవీ సుభద్ర ప్రతీకాత్మకంగా భువనేశ్వరి చిత్ర పటాలు దర్శనం ఇస్తాయి.