
● 14 నుంచి వికాస్ మేళా
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో వికాస్ మేళా, సుభద్రశక్తి పారంపర వంటల పోటీలు, మామిడి పండ్ల ప్రదర్శన వంటి 77 స్టాల్స్ మేగా అభివృద్ధి మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధిశాఖ అధికారి అంశుమాన్ మహాపాత్రో, ఓర్మాస్ డిప్యూటీ సీఈఓ సుభాల్ జనమని, డీపీఆర్ఓ ప్రదిప్త గురుమయి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వికాస్ మేళా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. ఈ మేళాలో జిల్లాలో అమలు జరుగుతున్న అనేక ప్రభుత్వ పథకాలు, స్టాల్స్ ద్వారా తెలియజేస్తామన్నారు. దీంతోపాటు గజపతి జిల్లాలో 199 గ్రామ పంచాయతీల వికాస్ వాహన యాత్ర జరుపుతామన్నారు. ఈ మేళాలో ప్రజలకు ఉచిత ఆధార్ కార్డు సేవలు, రెవెన్యూ పట్టాల పంపిణీ, కిసాన్ క్రెడిట్ కార్డుల పంపిణీ, ప్రధాన మంత్రి సూర్యజ్యోతి ఘర్ పథకం దరఖాస్తుదారుల ఆమోదం, పీఎం జనమనయోజనా, లేబర్కు జాబ్ కార్డులు, రేషన్ కార్డులు ప్రదానం, ఉజ్వల్ కృషి విభాగం ద్వారా ముఖ్యమంత్రి కిసాన్ యోజన పథకాలు అందిస్తామని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు.