
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి
జయపురం:
ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిచాలని వక్తలు అన్నారు. కేంద్ర ప్రభుత్వ అమృత మిత్ర పథకంలో ప్రతి మహిళకు ఒక చెట్టు కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వయం సహాయక గ్రూపు మహిళలకు మొక్కలు ఎలా నాటాలి అనే విషయంపై శిక్షణ ఇచ్చారు. జయపురం సమితి మొకాపుట్, గోవర్ధన ముండ ప్రాంతంలో 400 మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నారు. అంతే కాకుండా పట్టణ ప్రాంతంలోని పార్క్లు, ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలకు నీళ్లు పోసి వాటిని పరిరక్షించేందుకు స్వయం సహాయక గ్రూపు మహిళలను అమృత మిత్ర పథకంలో మమేకం చేసినట్లు నిర్వాహక అధికారి, మున్సిపాలిటీ ఇంజినీర్ అజయ జాని వెల్లడించారు. మొక్కలు నాటి వాటిని ఎలా పర్యవేక్షించాలి, నీరు, మట్టి, యాజమాన్యం, పార్కులలో మొక్కలను ఎలా పెంచాలి మొదలగు విషయాలపై మహిళలకు ఈ కార్యక్రమంలో శిక్షణ ఇచ్చారు. స్వయం సహాయక గ్రూపుల మహిళలను మొకాపుట్, గోవర్ధనముండ ప్రాంతాలకు తీసుకెళ్లి పరిసర ప్రాంతాలను చూపించి ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో చూపించారు. మొక్కాపుట్ ప్రాంతంలో 300, గోవర్ధనముండ ప్రాంతంలో 100 మొక్కలు నాటాలని సూచించారు. వర్షాలు పడక ముందే మొక్కలు నాటాలని.. నాటిన మొక్కలు ఎనిమిది అడుగులు పెరిగేంత వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సక్రమంగా మొక్కలను సంరక్షించిన వారికి ప్రభుత్వం నగదు బహుమతి అందజేస్తోందన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎస్హెచ్జీ మహిళ గ్రూపు ఉత్తమంగా ఎంపిక అవుతుందో ఆ గ్రూపునకు రాష్ట్ర ప్రభుత్వం బహుమతి ఇచ్చి సన్మానిస్తోందని మున్సిపల్ ఇంజినీర్ అజయ జాని వెల్లడించారు. కార్యక్రమంలో అమృత యోజన నోడల్ అధికారి సుబ్రత్ సింగ్, జిల్లా నోడల్ అధికారి మధుస్మిత ప్రహరాజ్ పాల్గొన్నారు.