జయపురం: న్యూడ్ ఫొటోలు పంపుతూ బెదిరిస్తున్న ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు జయపురం పట్టణ పోలీసు అధికారి ఈశ్వర తండి గురువారం వెల్లడించారు. ఆయన వివరణ ప్రకారం గత ఫిబ్రవరి 28 వ తేదీన ఒక వ్యక్తి వచ్చి లిఖిత ఫిర్యాదు చేశారని, అందులో ఒక ఏడాది కిందట తెలియని వ్యక్తి తన కుమార్తెకు న్యూడ్ ఫొటోలు పంపాడని పేర్కొన్నట్లు తెలిపారు. ఓ నంబర్ ద్వారా ఇలా ఫోటోలు, వీడియోలు పంపిస్తున్నాడని, సోషల్ మీడియాలో పెట్టి బెదిరిస్తున్నాడని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజఖరియర్కు చెందిన మహమ్మద్ తాహీర్ అనే వ్యక్తి ఇలా ఫొటోలతో బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని బుధవారం రాత్రి అరెస్టు చేశారు. నిందితుడి నుండి రియల్మే 11 ప్రొ మొబైల్ ఫోనులు, రియల్మే టేబ్ 9, ఓలివ్ గ్రీన్ కలర్,ఒక ఇన్ఫిక్స్ లేప్టాప్,ఒక హార్డ్ డిస్క్ (1 టిబి ) సీగేట్, ఒక 256 జీబీ హార్డ్ డిస్, రెండు 16 జీబీల పెన్డ్రైవ్లు, మూడు 32 జీబీల పెన్ డ్రైవ్లు, ఒక 4 జీబీ హెచ్పి పెన్ డ్రైవ్, ఒక 4 జిబి మైక్రో ఎస్డి మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కరోనాతో 50 మంది జర్నలిస్టులు మృతి
భువనేశ్వర్: మహమ్మారి కోవిడ్–19 సంక్రమణ కారణంగా 50 మంది జర్నలిస్టులు మరణించారని రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజి గురువారం సభలో వెల్లడించారు. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే సౌవిక్ బిస్వాల్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఈ విషయం వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన 49 మంది జర్నలిస్టుల బంధువులకు ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారు. కటక్ జిల్లాకు చెందిన ఒక జర్నలిస్ట్ కుటుంబానికి మాత్రమే రాష్ట్రం పరిహారం చెల్లించలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వారు వేరే రాష్ట్రం నుంచి ఈ సహాయం పొందారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సభలో ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కోవిడ్ కారణంగా గంజాం జిల్లాలో అత్యధికంగా 10 మంది జర్నలిస్టులు మృతి చెందారు. భువనేశ్వర్ సహా ఖుర్దా జిల్లాలో 8 మంది దీని బారిన పడి మరణించారు. సుందర్గఢ్ జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
టీజీఐ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
గార: మండలంలోని సతివాడ జంక్షన్లో ట్రాన్స్వర్డ్ గార్నెట్ ఆఫ్ ఇండియా(టీజీఐ) ఇసుక పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్ బ్లాక్ పక్క ఉన్న స్టాకు గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో సాయంత్రం వరకు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖాధికారి వరప్రసాద్ తెలిపారు. ఇసుక లోడింగ్ చేసే బ్యాగులు కాలిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు.
నేడు డీఎంఈ రాక
శ్రీకాకుళం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలలను పరిశీలించి వైద్యులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం జిల్లాలోని మరికొన్ని ఏరియా ఆస్పత్రులను పరిశీలించే అవకాశం ఉంది.