విద్యుత్‌ బిల్లుల కాల్చివేత | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బిల్లుల కాల్చివేత

Published Thu, Mar 20 2025 1:09 AM | Last Updated on Thu, Mar 20 2025 1:05 AM

ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలంటూ సీపీఎం నిరసన

విజయనగరం గంటస్తంభం: విద్యుత్‌ బిల్లులు తగ్గించి ట్రూ అప్‌ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పూల్‌భాగ్‌ కాలనీ 4వ వార్డులో విద్యుత్‌ బిల్లులు కాల్చివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పిన చంద్రబాఋ నేడు విద్యుత్‌ చార్జీలు పెంచి ట్రూ అప్‌ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. ట్రూ అప్‌ చార్జీలను రద్దు చేసి విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్‌, సర్దుబాటు చార్జీల పేరిట రూ.15 వేల కోట్ల విద్యుత్తు భారం మోపిందన్నారు. అవినీతితో కూడిన సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్మి రామాలక్ష్మి, సభ్యులు విజయ, గురయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

పార్వతీపురంటౌన్‌: ప్రధానమంత్రి యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విజ్‌ సీఈఓ ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు సమాజంలో యోగాను అంకిత భావంతో ప్రజల్లోకి తీసుకు వెళ్లినవారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అవార్డులకు ఎంపికై న వారికి రూ. 25 లక్షల నగదు బహుమానం ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారు దరఖాస్తులను నిర్ణీత ప్రొఫార్మాలో నేరుగా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూౖ.మైజీఓవీ.ఐన్‌ వెబ్‌సైట్‌లో హెచ్‌టీటీపీఎస్‌://ఇన్నొవేషన్‌ఇండియా.మైజీఓవీ.ఐన్‌/పీఎం–యెగా–అవార్డులు–2025 లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

10 లీటర్ల సారా స్వాధీనం

ద్విచక్రవాహనం సీజ్‌

గుమ్మలక్ష్మీపురం (కురుపాం): కురుపాం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం దత్తివలస గ్రామంలో 10 లీటర్ల సారాను ద్విచక్రవాహనంపై తరలిస్తూ చినమేరంగి గ్రామానికి చెందిన వెలగాడ బాలకృష్ణ పట్టుకున్నట్లు సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం, సారాను కురుపాం ఎకై ్సజ్‌ స్టేషన్‌ వద్ద చూపించారు. బాలకృష్ణతో పాటు సారా సరఫరా చేసిన సిరిపురం సుధాకర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

టాటా ఏస్‌ వాహనం బోల్తా

ఇద్దరికి గాయాలు

గంట్యాడ: మండలంలోని లక్కిడాం నుంచి బొండపల్లి మండలంలోని రయింద్రం గ్రామానికి వాటర్‌ బస్తాలు తీసుకుని వెళ్తుండగా గంట్యాడ మండలంలోని చినమానాపురం జంక్షన్‌ వద్ద టైర్‌ పంక్చర్‌ కావడంతో 15 అడుగుల గోతిలో టాటా ఏస్‌ వాహనం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాల య్యాయి. ప్రైవేట్‌ వాహనంలో వారిని విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ఫిర్యాదు రాలేదని గంట్యాడ పోలీసులు తెలిపారు.

శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆదాయం లెక్కింపు

మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఎనిమిదవ జాతర ఆదాయాన్ని ఈవో వీవీ.సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. శీఘ్రదర్శనం టిక్కెట్ల ద్వారా రూ.69,700, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.59,760. కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.2,400, మహాఅన్నదానం విరాళాల ద్వారా రూ.92,011, లడ్డూప్రసాదం ద్వారా రూ.61,950, పులిహోర ప్రసాదం ద్వారా రూ.42,250 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. మొత్తంగా ఎనిమిదవ జాతరలో రూ.3,28,071 ఆదాయం వచ్చిందని చెప్పారు.

పది హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరు

పార్వతీపురంటౌన్‌: పదవతరగతి హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 10,367 మంది విద్యార్ధులకు గాను 10,319 మంది హాజరయ్యరని, 48 మంది గైరాజరయ్యారయ్యారని పేర్కొన్నారు. 31 మంది స్క్వాడ్‌ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement