జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపి
మచిలీపట్నంటౌన్: జిల్లాలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుట్టాల గోపి కోరారు. నగరంలోని ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ సహాయ క్లినిక్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, దిశా న్యాయమూర్తి వరలక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి..
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ మణిపూర్, త్రిపుర, మిజోరం చుట్టుపక్కల ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులు వివిధ రకాల పనులు జిల్లాలో చేస్తున్నారని, వారికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో న్యాయ సహాయ క్లినిక్ను ఏర్పాటు చేశామన్నారు. పుర ప్రజలకు, వలస కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఎవరికై నా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ సహాయ క్లినిక్ సంప్రదించేలా అవగాహన కల్పించాలన్నారు. న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఒక న్యాయ సహాయ కౌన్సిలర్ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో డీపీటీవో వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ డిపో మేనేజర్ టి. పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.


