వరి పండని పొలాల్లో అనాదిగా చెరువుల సాగు మరమ్మతులకు తెలుగు తమ్ముళ్లకు కప్పం చెల్లించాల్సి వస్తోంది మంత్రి కొల్లు రవీంద్ర ఇద్దరు బ్రోకర్లతో ఎకరానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారు! పెదపట్నం ప్రాంతంలో 20 ఎకరాల మడ భూములు చెరువులుగా మారుస్తున్నారు ఆర్డీఓ, తహసీల్దార్లకు ఇవి పట్టవా జేసీకి వినతిపత్రం ఇచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని, రైతులు
మరమ్మతులు చేయాలంటే డబ్బు ఇవ్వాల్సిందే..
పేద రైతులపై
చిలకలపూడి(మచిలీపట్నం): బందరు మండల పరిధిలోని సముద్రతీర ప్రాంత గ్రామాల్లో వరి పండని పొలాల్లో అనాదిగా చెరువులు సాగు చేస్తున్నారని పేద రైతులపై మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు, రెవెన్యూ అధికారులు ప్రతాపం చూపిస్తే సహించేది లేదని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) హెచ్చరించారు. ‘మీ కోసం’లో పేద రైతులు పడుతున్న కష్టాలను జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్కు సోమవారం వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1990 నుంచి బందరు సౌత్ మండల పరిధిలోని చిన్నాపురం, వాడగొయ్యి, కోన, పల్లెతుమ్మలపాలెం, కేపీటీపాలెం, పాతేరు, పోలాటితిప్ప తదితర గ్రామాల్లో 80 నుంచి 90 శాతం మంది రైతులు వరిపంట పండకపోవటంతో చెరువులుగా మార్చుకుని సాగు చేసుకుని జీవిస్తున్నారు.
టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ మండలంలో చెరువులు తవ్వుకుంటే తమకు కప్పం కట్టలేదని నాయకులు సీజ్ చేయించారన్నారు. 50 వేలు మెజార్టీ వచ్చిందని చెప్పుకుంటున్న మంత్రి కొల్లు రవీంద్ర ఈ రకంగా ఎరానికి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఇటీవల కోనలో చిన్న రైతు 80 సెంట్ల భూమిని మరమ్మతులు చేసుకుంటుంటే ఆర్డీవో సాంబశివరావు హుటాహుటిన అక్కడకు వెళ్లి చెరువును పూడ్చి వేయాలని, పట్టాలు తీసుకువచ్చి చూపించాలని హుకుం జారీ చేయడం భావ్యమా అని పేర్ని నాని అన్నారు.
పెదపట్నంలో 20 ఎకరాల మడ అడవులు తవ్వుతున్నా పెద్ద రైతులు అసైన్డ్ భూమిలో వంద ఎకరాల్లో చెరువులు తవ్వుతున్నా తహసీల్దార్, ఆర్డీవోకు వారు కనపడారా అని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్డీఓ సాంబశివరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత మడ అడవులు, వందల ఎకరాల అసైన్డ్ భూముల్లో చెరువులు తవ్వుతున్నా పట్టించుకోని ఆయన పేద రైతులపై ప్రతాపం చూపుతున్నారని దీనిపై జేసీకి వివరించామన్నారు.
ఆయన తీరు ఇలాగే ఉంటే ఏసీబీని ఆశ్రయించడానికి కూడా వెనుకడామన్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత తీసుకుంటున్నారో, ఎవరి ద్వారా తీసుకుంటున్నారో ప్రజలే సాక్షులుగా చెబుతున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా చెరువుల సాగు చేస్తున్న పేద రైతుల మరమ్మతులను అడ్డుకుంటే పోరాడతామని ఆయన హెచ్చరించారు. పేర్ని నాని వెంట జేసీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు లంకే వెంకటేశ్వరరావు, గణేశన రమేష్, మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
రెండేళ్లకోసారి మరమ్మతులు చేయాల్సి వస్తుందని, ఇవి చేయాలంటే మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుమారుడు మంత్రాల శ్రీను చెయ్యి తడపనిదే పనులు ముందుకెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎకరానికి రూ. 50 వేలు ఇస్తే కానీ మరమ్మతులు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఇటువంటి పేద రైతులు ఇంత మొత్తంలో ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో తహసీల్దార్, ఆర్డీఓలు కూడా వారికే ఏజెంట్లుగా పని చేయడం విడ్డూరంగా ఉందన్నారు.


