అన్న ప్రసాదిని..
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు.. ఎవరు ఆకలితో అలమటిస్తున్నా వారికి సాయం చేయమని చెబుతుంటారు.. అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికే భిక్షను ప్రసాదించిన అమృత మూర్తి అన్నపూర్ణాదేవి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారు ఆ ఆది దేవత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో అక్షయపాత్ర ధరించి, ఆదిభిక్షువుకు అన్నాన్ని ప్రసాదిస్తున్న అవతారంలో కొలువైన అమ్మ దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించిన భక్తులు ఆనందంతో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఇల ప్రకాశం.. ఇంద్ర వైభోగం..
విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతున్న ప్రకాశం బ్యారేజీ, దుర్గమ్మ కొండ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడో రోజైన బుధవారం దుర్గమ్మ శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు, బాలభోగం నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనం మూడు క్యూలైన్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం అమ్మవారి మహా నివేదన, పంచ హారతుల తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది.
సర్వ దర్శనం క్యూలైన్లలో రద్దీ..
తెల్లవారుజాము నుంచి సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. సాధారణ భక్తులతో పాటు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులు క్యూలైన్లో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే ఉపవాసంతో ఉండే భవానీలకు ప్రత్యేక ఏర్పాటు చేయకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలకు చెందిన భక్తులు అమ్మవారి దీక్షలను స్వీకరించి దర్శనానికి వచ్చారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 11గంటల వరకు సర్వ దర్శనం క్యూలైన్లో రద్దీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది.
వీఐపీ క్యూలైన్లోకి..
సేవా బృంద సభ్యులు, పోలీసు సిబ్బంది ఎవరైనా వీఐపీ క్యూలైన్ ద్వారానే అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ సూచించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని స్కానింగ్ పాయింట్, మీడి యా పాయింట్ల వద్ద పలుమార్లు తనిఖీలు నిర్వహించారు. సిఫార్సులతో అమ్మవారి దర్శనం కోసం నేరుగా వస్తున్న వారిని ఆపి కార్డులు తనిఖీలు చేశారు.
అన్నదాన భవనంలో తనిఖీలు..
అమ్మవారి అన్నప్రసాదం కోసం తరలివచ్చిన భక్తులతో మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనం కిటకిటలాడింది. మరో వైపున అన్న ప్రసాద నాణ్యతలలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్కలెక్టర్ ఎస్. ఇలక్కియ తనిఖీలు నిర్వహించారు.
మూడో రోజు ఆదాయం రూ.31.08లక్షలు
దసరా ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం దేవస్థానానికి రూ. 31.08లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రూ. 300 టికెట్ల విక్రయం ద్వారా రూ.10.56లక్షలు, రూ.100 టికెట్ల విక్రయం ద్వారా రూ.3.46లక్షలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.98లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ల విక్రయం ద్వారా రూ.11.89లక్షలు, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం, ఇతర సేవల ద్వారా రూ.2.10 లక్షల మేర ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు 58 వేల మంది భక్తులు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా దర్శించుకున్నారని, అన్నప్రసాదం 22,506 మందికి పంపిణీ చేశామని చెప్పారు.
అభయ ప్రదాయిని
అభయ ప్రదాయిని
అభయ ప్రదాయిని
అభయ ప్రదాయిని