యథేచ్ఛగా లైంగిక దాడులు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా లైంగిక దాడులు

Jun 11 2025 7:48 AM | Updated on Jun 11 2025 7:48 AM

యథేచ్ఛగా లైంగిక దాడులు

యథేచ్ఛగా లైంగిక దాడులు

కూటమి పాలనలో
● బాధితుల్లో ఆర్నెల్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధులు ● నేరాలకు పాల్పడుతున్న వారంతా టీడీపీ వారే ● మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వాడకమే ఇందుకు కారణం ● మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వాడకమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బాధితుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాది కూటమి పాలనలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయని, రాష్ట్రంలో మహిళలు బతకాలంటే భయపడుతున్నారని, బాలికల తల్లిదండ్రులు గజగజా వణికిపోతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడిన వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరస నగా వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సామాజిక న్యాయ మహాశిల్పానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. ఈ ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు బయ టకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. మహిళలు ఇంట్లో ఉన్నా, బడిలో, కళాశాలలో ఉన్నా, చివరికి పని ప్రదేశంలో ఉన్నా అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల హిందూపురం, అనంతపురంలో చిన్నారి తన్మయి. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు.

గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు

కూటమి పెద్దలు పనికిమాలిన విషయాలపై దృష్టి పెడుతున్నారని, మహిళలపై ఇన్ని ఘటనలు జరి గినా సీఎం, డెప్యూటీ సీఎం, హోం మంత్రి ఎక్క డైనా స్పందించారా అని వరుదు కల్యాణి ప్రశ్నించారు. కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య చేశారని, ఉండి నియోజకవర్గంలో, భీమిలిలో ఇలా ఎక్కడా చూసినా ఇలాంటి ఘటనలు వినని రోజు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోజుకు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయని, నమోదు కానివి ఇంకా ఎన్నో ఉన్నాయని, గంటకు మూడు, నాలుగు లైంగికదాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న ఒక్క రివ్యూ చేయకపోవడం సిగ్గుచేటని, అవసరం లేని విషయాలపై, కక్షపూరిత రాజకీయాలపై ప్రెస్‌మీట్లు పెట్టే హోం మంత్రి ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఏరులై పారుతున్న మద్యం

కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కల్యాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి రూపుమాపుతామని గొప్పలు చెప్పారని, హోం మంత్రి నివసిస్తున్న విశాఖలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతోందని, ఆమె నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతోందని వివరించారు. కూటమి పాలనలో వీధికో గాంధార పుత్రుడు, వీధివీధినా గంజాయి పుత్రులే కనిపిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement