కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా | - | Sakshi
Sakshi News home page

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

Jun 9 2025 10:22 AM | Updated on Jun 9 2025 10:22 AM

కొండప

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి పుర పాలక సంఘం చైర్మన్‌, రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు సోమవారం నిర్వహించాల్సిన ఎన్నిక అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 నవంబర్‌లో పరోక్ష పద్ధతిలో జరిగిన చైర్మన్‌, రెండు వైస్‌ చైర్మన్ల ఫలితాలు హైకోర్టు సీల్డ్‌కవర్‌లో నిక్షిప్తం కావడంతో ఫలితాల వెల్లడికి ఈనెల 9వ తేదీ నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశం విజయవాడ ఆర్డీవో, ఎన్నికల నిర్వహణ అధికారి కావూరి చైతన్య వాయిదా వేశారని వివరించారు. సమావేశం తేదీని తర్వాత ప్రకటిస్తామని కమిషనర్‌ తెలిపారు

దుర్గమ్మ నిత్యాన్న దానానికి విరాళాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్‌ నివాసి వి.బాలాజీ, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఇ.ఏడుకొండలు కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసిన బాలాజీ నిత్యాన్నదానానికి రూ.లక్ష, ఏడుకొండలు కుటుంబం రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

బాలాత్రిపురసుందరికి

బంగారు ఆభరణాలు

కూచిపూడి(మొవ్వ): కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ పసుమర్తి రామలింగశాస్త్రి, పద్మ దంపతులు (హైదరాబాద్‌–కూచిపూడి) నాట్యాచార్యుల ఇల వేల్పైన బాలాత్రిపురసుందరి అమ్మవారికి బంగారు ఆభరణాలను ఆదివారం అందజేశారు. దేవాలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి.. అర్చకులు పెనుమూడి సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన రెండు హారాలను, దాసాంజనేయ స్వామికి రూ. 38 వేల విలువైన 108 వెండి తమలపాకుల మాలను అందజేశారు. ఈ సందర్భంగా హారాలను అమ్మవారికి అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు చేశారు.

ఎన్జీ రంగా స్ఫూర్తితో ముందుకు సాగాలి

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాలకు ముందుకు సాగాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు నాయకులు ఆచార్య ఎన్జీ రంగా వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆదివారం బందరు లాకుల సమీపంలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో రైతు నాయకులు ఎన్జీ రంగా 30వ వర్ధంతి సభ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో జరిగింది. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ కాలంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి రంగా ఎనలేని కృషి చేశారన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా సమర యోధుడుగా కీర్తి పొందారని, దేశ వ్యాప్తంగా రైతు రక్షణ యాత్రలు చేసిన ఘనత ఉందన్నారు. నేడు పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు కార్పొరేట్‌ అనుకూల వైఖరికి.. వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పేరుతో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉందని గుర్తు చేశారు. గోగినేని ధన శేఖర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు కేవీవీ ప్రసాద్‌, వై. కేశవరావు, మోతుకూరి వెంకటేశ్వరరావు, కొలనుకొండ శివాజీ, కోనేరు బసవేశ్వరరావు, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా
1
1/2

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా
2
2/2

కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement