వరి విత్తనాలు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

వరి విత్తనాలు పంపిణీ

May 29 2025 1:21 AM | Updated on May 29 2025 1:21 AM

వరి వ

వరి విత్తనాలు పంపిణీ

కంకిపాడు: ఎట్టకేలకు రైతులకు వరి విత్తనాలు పంపిణీ అయ్యాయి. ‘విత్తనానికి వెతుకులాట’ శీర్షికన ఈనెల 25న సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆగమేఘాలపై రైతులకు ఖరీఫ్‌ సాగుకు అనువైన వరి విత్తనాలను సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. చర్యల్లో భాగంగా ఉప్పలూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతులకు వరి విత్తనాలను ఏఎంసీ చైర్మన్‌ అన్నే ధన రామకోటేశ్వరరావు పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ రైతులకు అవసరమైన వరి విత్తనాలు ఆయా గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్సిడీపై అందించే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి, సర్పంచ్‌ లాం సోనియా, మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్‌ పాల్గొన్నారు.

6న కూచిపూడిలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం

మొవ్వ: కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో జూన్‌ 6వ తేదీన కృష్ణాజిల్లా స్థాయి యోగాంధ్ర–2025కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మొవ్వ ఎంపీడీవో జె. విమాదేవి తెలిపారు. సుమారు 1000 మందికి పైగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ, జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు.

వీఐపీల భద్రతపై అవగాహన

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): వీఐపీలు ప్రయాణించే సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, భద్రత విషయంలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వర్తించాలని రైల్వే ఆర్‌ఐ శీరిష సిబ్బందికి సూచించారు. రైల్వే ఎస్పీ కార్యాలయంలో రైల్వే రిజర్వ్‌డ్‌ పోలీసులకు, అధికారులకు వీఐపీ భద్రత విధులపై ఓరియెంటేషన్‌ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఐపీలు ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆర్‌ఐ శీరిష వివరించారు. ప్రధానంగా ఉన్నత స్థాయి వ్యక్తులను, వారి పరిసరాలను రక్షించడానికి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముప్పు అంచనా, భద్రతా ప్రణాళిక, అత్యవసర ప్రతిస్పందన వంటి అనేక అంశాలను పర్యవేక్షించాలన్నారు.

వత్సవాయిలో 46.2 మి.మీ. వర్షం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలంలో 46.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల మధ్య జిల్లాలోని పలు మండలాల్లో 8.34 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గంపలగూడెంలో 23.0, నందిగామలో 18.6, వీరులపాడులో 18.2, చందర్లపాడులో 12.6, పెనుగంచిప్రోలులో 10.6, జి. కొండూరులో 7.0, కంచికచర్లలో 5.2, జగ్గయ్యపేటలో 4.8, ఇబ్రహీంపట్నంలో 4.2, ఏ కొండూరులో 3.6, రెడ్డిగూడెం మండలంలో 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

31న కలెక్టరేట్‌లో జాబ్‌ డ్రైవ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ వికాస ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీ శనివారం విజయవాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో జాబ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్‌ డ్రైవ్‌లో దాదాపు 10 ప్రముఖ కంపెనీలు 200 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయన్నారు. శాండ్‌స్పేస్‌ టెక్నాలజీస్‌, హెచ్‌1 హెచ్‌ఆర్‌, డేటా వ్యాలీ, ముత్తూట్‌ ఫైనాన్స్‌, వరుణ్‌మోటార్స్‌, అడ్మిషన్‌ యారో అండ్‌ అకడమిక్‌ ఓవరీస్‌, మణప్పురం ఫైనాన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఫాక్స్‌కాన్‌ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వీరికి ఉద్యోగాలను బట్టి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40వేల వరకు జీతం, భోజనం, వసతి, రవాణా సౌకర్యాలు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్స్‌లో హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు 98494 65427లో సంప్రదించాలని పీడీ లచ్చారావు సూచించారు.

వరి విత్తనాలు పంపిణీ  1
1/2

వరి విత్తనాలు పంపిణీ

వరి విత్తనాలు పంపిణీ  2
2/2

వరి విత్తనాలు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement