
అమ్మ భూమి పరిరక్షణకు చర్యలు
వివాదాస్పద భూమిని పరిశీలించిన దేవదాయశాఖ ఏసీ
కంకిపాడు: అమ్మ భూమి పరిరక్షణకు సమర్థ చర్యలు తీసుకుంటామని, అన్యాక్రాంతం కానివ్వబోమని దేవదా యశాఖ ఏసీ నూతక్కి వెంకట సాంబశివరావు అన్నారు. మండలంలోని నెప్పల్లిలో గల దేవదాయశాఖ భూమిని ఆ శాఖ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. వివాదాస్పదంగా మారి న భూమిలో రియల్ వెంచర్ నిర్వాహకులు చేపడుతున్న పనులను అడ్డుకున్నారు. స్థలాల మెరక, వ్యర్థనీటి తొలగింపు పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏసీ నూతక్కి వెంకట సాంబశివరావు విలేకరులతో మాట్లాడారు.
అగ్రిమెంట్లు తేవాలని ఆదేశం..
మండలంలోని నెప్పల్లి గ్రామంలోని ఆర్ఎస్ నంబరు 101లో 4.41 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ దుర్గగుడి దేవస్థానానికి చెందిన భూమి ఉందని ఏసీ చెప్పారు. ఈ భూమిని దేవదాయశాఖకు సంబంధం లేకుండా కన్యకా పరమేశ్వరీ సత్రం నిర్వాహకులు అడంగల్లో పేరు నమోదు చేయించి, లీజుకు ఇచ్చారని చెబుతున్నారన్నారు. లీజుకు సంబంధించిన దస్తావేజులు అందించాలని ఆదేశించామన్నారు. దేవస్థానానికి చెందిన భూమి నుంచి రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్వాహకులు అక్రమంగా రహదారిని నిర్మించారన్నారు. కన్యకా పరమేశ్వరీ సత్రం నుంచి తమకు లీజుకు ఇచ్చారని చెబుతున్నారన్నారు. అందుకు సంబంధించిన దస్తావేజులు, అగ్రిమెంట్లు తేవాలని ఆదేశించామన్నారు. దేవదాయ శాఖకు చెందిన భూమి నుంచి రోడ్డు నిర్మించటాన్ని సహించేది లేదన్నారు. తక్షణమే రోడ్డును మూసివేస్తున్నామన్నారు. దుర్గగుడి అధికారులతో భూమి వ్యవహారంపై సంప్రదింపులు జరిపామన్నారు. 43 ప్రాపర్టీ రిజిస్టర్లో భూమి వివరాలను పొందుపర్చటంతో పాటుగా, భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వివరించారు. పరిశీలనలో ఇన్స్పెక్టన్ సుజన్కుమార్, ఈఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
లంచం తీసుకున్న డెప్యూటీ సర్వేయర్కు జైలు
పెనుగంచిప్రోలు: ఏసీబీ కేసులో మండల సర్వేయర్గా పనిచేసిన సబతి సత్యనారాయణకు ఏసీబీ ప్రత్యేక కోర్టు గురువారం ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.6,000 జరిమానా విధించింది. పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు గ్రామానికి చెందిన గింజుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అతని తండ్రి వ్యవసాయ భూమికి చెందిన సర్వే రిపోర్టును తహసీల్దార్కు పంపటానికి రూ.2,500 లంచం డిమాండ్ చేయగా.. విజయవాడ అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. బాధితుడు శ్రీనివాసరావు వద్ద నుంచి 2010, అక్టోబర్ 15న సర్వేయర్ లంచం డబ్బులు తీసుకొంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అతనిపై చార్జ్షీట్ వేశారు. కోర్టు విచారణ అనంతరం గురువారం జరిమానాతో పాటు శిక్ష విధించారు.
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పొడిగింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మూడు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31 వరకు కార్డులపై కాలపరిమితి పొడిగింపు స్టిక్కర్ను పొంది అనంతరం బస్సు పాస్లను తీసుకోవాల్సిందిగా డీఐపీఆర్వో ఓ ప్రకటన తెలిపారు. 30వ తేదీ శుక్రవారం నుంచి డీఐపీఆర్వో కార్యాలయ పనివేళల్లో స్టిక్కర్ పొందాలని కోరారు.