
ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం
కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో స్టేషన్ ఎదురుగా ఉన్న మసీదులో బయట వైపు గల ఒక గదిలోని ఫ్యాన్కు ఓ వ్యక్తి ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని వేలాడుతూ ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు ఎరుపు రంగులో ఉండి, నలుపు, తెలుపు జుట్టు కలిగి, 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉండవచ్చని తెలిపారు. తెల్లని చొక్కాపై నల్లని చుక్కల డిజైన్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని చెప్పారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిళ్లా రవి ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుని గురించి వివరాలు తెలిసిన వారు 9849808555 నంబర్లో గానీ, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గానీ సంప్రదించాలని కోరారు.
చిన్నబోయిన అమ్మతనం
నడిరోడ్డుపై నెలలు నిండని మృత శిశువు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఓ అమ్మ తన కాఠిన్యాన్ని చూపింది.. కడుపుతీపిని చంపుకొని అమ్మతనం చిన్నబోయేలా చేసింది.. నడి రోడ్డుపై అర్ధరాత్రి నెలలు నిండని పసిగుడ్డును వదిలేసి కర్కశాన్ని ప్రదర్శించింది. ఈ ఘటన కొత్తపేట కింద ప్రాంతంలోని సింహాద్రి వీధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై నెలలు నిండని పసిగుడ్డును పడేశారంటూ స్థానిక వీఆర్వో పామర్తి శివనాగేంద్రస్వామికి సమాచారం అందింది. దీంతో కొత్తపేట పోలీసుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రాణాలను కోల్పోయిన నెలలు నిండని పసికందు గుర్తించారు. ఘటనపై వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృత శిశువును ఖననం చేసేందుకు తరలించారు.
గుర్తుతెలియని వాహనం
ఢీకొని వృద్ధుడు దుర్మరణం
నందివాడ: మండలంలోని టెలిఫోన్ నగర్ ఆర్టీవో ట్రాక్స్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధు డు అక్కడికక్కడే మృతి చెందాడు. నందివాడ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. గుడివాడ రూరల్ మండలం శేరిగోల్వేపల్లి గ్రామానికి చెందిన నెరుసు బసవేశ్వరరావు (90) తన ఇంటి నుంచి బంధువుల ఫంక్షన్కి వచ్చి.. తిరిగి గురువారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో సుమారు 3.30 గంటల ప్రాంతంలో రోడ్డు మార్జిన్లో రోడ్డు దాటుతుండగా టెలిఫోన్ నగర్ ఆర్టీవో ట్రాక్స్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన వృద్ధుడి పై నుంచి ఆ వాహనం వెళ్లడంతో తల నుజ్జునుజ్జు అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి బలవన్మరణం