
ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్రే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్య, ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా మే 21న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమం ముందుకెళ్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. ఆయుష్శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పోలీస్ కమిషనరేట్, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో పోలీస్ థీమ్ యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కె.విజయానంద్ పాల్గొని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు.
విశేష స్పందన..
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి అందించిన విలువైన యోగా సంపదపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ యోగాసనాల కార్యక్రమాలు జరుగుతున్నాయని, బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లోనూ థీమ్ యోగాను నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రణాళిక ప్రకారం జిల్లాలో దాదాపు 15 లక్షల మందికి యోగాను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ సొంతం చేసే యోగా ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కమిషనర్ జి.వీరపాండ్యన్, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.రాజకుమారి, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, ఏపీఎస్పీ ఐజీ రత్నకుమారి, డీసీపీ కేజీవీ సరిత పాల్గొన్నారు.
జూన్ 21 వరకూ కార్యక్రమాలు..
అనంతరం సీఎస్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అప్పటికీ కనీసం రెండుకోట్ల మందికి యోగాను నేర్పించేలా ప్రణాళిక ప్రకారం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.25లక్షల మంది యోగా ట్రైనర్లు నమోదు చేసుకున్నారని, వీరి సహాయంతో ప్రజలకు యోగాపై అవగాహన కల్పించడంతో పాటు యోగాసనాలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు.