
రైతులను సాగుకు సమాయత్తం చేయాలి
అనాథ బాలలతో జగనన్న
గరికపాడు(జగ్గయ్యపేట): ఖరీఫ్ సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖాధికారులు, శాస్త్రవేత్తలు ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు సూచించారు. గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ప్రీ ఖరీఫ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లాడుతూ.. జూన్ 12వ తేదీ వరకు రైతులను ఖరీఫ్ సాగుకు సమాయత్తం చేసేలా వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో భూమి, భూసార పరీక్ష, నీరు–నీటి పరీక్షల ప్రాముఖ్యత, సాగు మెలకువలు, పంటల ఎంపిక, అధిక దిగుబడులు ఇచ్చే పంట రకాలు, యాంత్రీకరణ సౌలభ్యం, పంటల యాజమాన్యం, సస్యరక్షణ, పాడి పశువుల యాజమాన్యంతో పాటు కేంద్ర, రాష్ట్ర పథకాలపై గ్రామ స్థాయిలో రైతులకు వివరిస్తారని పేర్కొన్నారు. ఖరీఫ్ సాగులో రైతుల అవసరాలను గుర్తించాలని సూచించారు. వరి, మిర్చి, మొక్కజొన్న పంటలతో పాటు కూరగాయలు, ఆహార ధాన్యాల సాగులో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక దిగుబడులు వచ్చేలా రైతులకు శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో వివరించాలన్నారు. గ్రామాల్లో పశుపోషణకు రైతులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అనుమంచిపల్లి, తక్కెళ్లపాడుకు చెందిన రైతులు సతీష్, వెంకటేశ్వర్లు జింకు సకాలంలో పంపిణీ చేయటం లేదని, పంట నష్టపరిహారం సక్రమంగా అందించలేదని, వరిలో ఎలుకల నివార ణకు అధికారులు కనీస చర్యలు తీసుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ ఢిల్లీరావు రైతుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేవీకేలో వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, డీఆర్ఎస్ మాధవిలత, కేవీకే కోఆర్డినేటర్ అచ్యుతరాజు, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణంరాజు, జగ్గయ్యపేట, నందిగామ ఏడీఏలు భవానీ, శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం వలంటీర్లు, ఏఓలు, వీఏఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు

రైతులను సాగుకు సమాయత్తం చేయాలి

రైతులను సాగుకు సమాయత్తం చేయాలి